ఫిబ్రవరి నెలలోనే భానుడి భగభగలతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు.
ఆరేళ్ల తరవాత ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి నెలలోనే భానుడి భగభగలతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. మండు వేసవిని తలపిస్తున్న ఎండలతో సొమ్మసిల్లుతున్నారు. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదివారం 38.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరేళ్ల తరవాత ఇదే అత్యధికం. 2009 ఫిబ్రవరి 26న గ్రేటర్లో 39.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో ఆల్టైమ్ రికార్డు. ఆ తరవాత ఫిబ్రవరి నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం.
కాగా దక్షిణాది నుంచి సముద్రంపై నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. మరో నెలరోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదవుతాయని తెలిపింది. కాగా ఉష్ణోగ్రతలతోపాటు గాలిలో తేమ శాతం పగటి వేళల్లో 29 శాతానికి పడిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు సొమ్మసిల్లుతున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.