అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి: ఈటల


సాక్షి, హైదరాబాద్: అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి ఈటల రాజేం దర్ తెలిపారు. 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయా శాఖలల్లో పనిచేస్తున్నట్లు హెచ్‌ఆర్‌ఎంఎస్ డేటా ప్రకారం ఇప్పటివరకు వివరాలు వచ్చాయన్నారు. ఉన్నతవిద్యలో 7,434, వైద్యశాఖలో 6,186, పంచాయతీరాజ్‌లో 3,454, సోషల్ వెల్ఫేర్‌లో 1,370 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు.


ఖాళీలు ఉన్నచోట నియామకాలు జరిగినవి, 2014 జూన్ 2 కు ముందు సర్వీసులో చేరినవారు, ప్రతినెలా జీతాలు తీసుకుంటున్నవారు, పార్ట్‌టైం జాబ్ చేయనివారు, అనుమతి లేకుండా విధులకు దూరం కాకపోవడం, ఇతరత్రా క్రమశిక్షణ చర్యలు తీసుకోనివారు, రిజర్వేషన్ విధానంలో రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, తదితరులకు ప్రాధాన్యం వంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికన వీటిని చేపడతామని మంత్రి తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కర్నె ప్రభాకర్, గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు విపక్ష నేత షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎన్.రామచంద్రరావు, పాతూరి సుధాకరరెడ్డి, పూల రవీందర్, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు వేసిన ఉపప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top