ఆ బస్సులను సీజ్‌ చేయవద్దు | Do not seize those buses | Sakshi
Sakshi News home page

ఆ బస్సులను సీజ్‌ చేయవద్దు

Jul 1 2017 1:07 AM | Updated on Aug 31 2018 8:34 PM

ఆ బస్సులను సీజ్‌ చేయవద్దు - Sakshi

ఆ బస్సులను సీజ్‌ చేయవద్దు

అరుణాచల్‌ప్రదేశ్‌ (ఏఆర్‌) రిజిస్ట్రేషన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు తిప్పుతున్న తిరుమల క్యాబ్‌ యాజమాన్యానికి హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది.

- ‘ఏఆర్‌’ బస్సులకు జూలై 10 వరకు ఊరట
- రవాణాశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: అరుణాచల్‌ప్రదేశ్‌  (ఏఆర్‌) రిజిస్ట్రేషన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు తిప్పుతున్న తిరుమల క్యాబ్‌ యాజమాన్యానికి హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఏఆర్‌ రిజిస్ట్రేషన్‌తో ఏపీలో తిరుగుతున్న తిరుమల క్యాబ్స్‌కు చెందిన బస్సులను జూలై 10 వరకు సీజ్‌ చేయవద్దని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేశారు.

ఏఆర్‌ రిజిస్ట్రేషన్లతో ఏపీలో తిరుగు తున్న బస్సులను ఎక్కడికక్కడే నిలిపేయాలంటూ ఈ నెల 13న రవాణాశాఖ జారీ చేసిన సర్క్యుల ర్‌ను సవాలు చేస్తూ తిరుమల క్యాబ్స్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ రాజా ఇలంగో విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... తిరుమల క్యాబ్స్‌కు చెందిన బస్సులను అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిçష్టర్‌ చేసి ఆల్‌ ఇండియా పర్మిట్‌తో ఆ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో తిప్పుతున్నామని తెలిపారు. పన్నులన్నింటినీ కూడా నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నామన్నారు.  మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 207(1) ప్రకారం తగిన పర్మిట్లు లేని వాటినే అధికారులు సీజ్‌ చేయాలని, కాని ఏపీ రవాణాశాఖ అధికారులు మాత్రం తమ బస్సులకు అన్ని రకాల పర్మిట్లు ఉన్నప్పటికీ సీజ్‌ చేస్తున్నారని తెలిపారు.

ఇందుకు కమిషనర్‌ సర్క్యులర్‌ను చూపుతున్నారని వివరించారు. తాము చేసిన తప్పేంటో చెప్పకుండా అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో బస్సులు ఉన్నాయి కాబట్టి తిరిగినివ్వమని చెప్పడం చట్టవిరుద్ధమే అవుతుందన్నారు. సెంట్రల్‌ మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 85(3) కింద తమ వాహనాలను సీజ్‌ చేశారని, అలా చేసే అధికారం వారికి లేదని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ కౌంటర్‌ నిమిత్తం విచారణను జూలై 10కి వాయిదా వేశారు. అప్పటివరకు ఏఆర్‌ రిజిస్ట్రేషన్‌తో రాష్ట్రంలో తిరుగుతున్న తిరుమల క్యాబ్స్‌కు చెందిన బస్సులను సీజ్‌ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement