
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
నగరంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అంతర్రాష్ట క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. తూర్పు
13 మంది అరెస్టు
రూ.26.48 లక్షల నగదు సీజ్
బెట్టింగ్కు వాడిన పరికరాలు, ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్ కేంద్రంగా ఐదు రాష్ట్రాల్లో బెట్టింగ్
నాంపల్లి: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అంతర్రాష్ట క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. తూర్పు మండలం టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి పర్యవేక్షణలో ఏకకాలంలో మూడు ప్రదేశాల్లో దాడులు చేసి 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.26,48,500 నగదును సీజ్ చేశారు. బెట్టింగ్ నిర్వహణ కోసం వినియోగించిన లైన్ బాక్సులతో కూడిన నాలుగు సి.డి.ఎం.ఎ సెల్ఫోన్లు, తొమ్మిది లైన్ ఫోన్లు, ఆరు ల్యాప్టాప్లు, మూడు టెలివిజన్లు, 36 సెల్ఫోన్లు, మూడు సెటప్ బాక్సులు, రెండు మౌత్ స్పీకర్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బషీర్బాగ్లోని నగర పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల క్రితం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. సత్య ప్రకాష్ జిందాల్ అలియాస్ నక్కు అనే వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్ను నిర్వహించి అధికంగా సంపాదించాలని అనుకున్నారు. బెట్టింగ్ నిర్వహణ కోసం బ్రోకర్లు, సబ్ బ్రోకర్లను నియమించుకున్నారు.
హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా ఏర్పాటుచేశారు. రాజస్థాన్కు చెందిన ఆషూ అనే కరుడుగట్టిన మోసకారి, క్రికెట్ బెట్టింగ్ ఏజెంటుతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. యువతను ఆకట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎర చూపి ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా మ్యాచ్ వివరాలను వీక్షించే అవకాశం కల్పించారు. బెట్టింగ్ నిర్వహణను తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, హర్యాన, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరింపజేశారు. నాలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో వ్యాపారం కొనసాగించి లక్షల్లో ధనాన్ని పోగు చేశారు. పది లక్షల వరకు బెట్టింగ్ కట్టే వారిని తన వద్ద ఉంచుకుంటారు. ఆ పైబడిన మొత్తాన్ని చెల్లించే వారిని రాజస్థాన్లో ఉన్న ఆషూను డీల్ చేయమంటారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి ముగిసే వరకు ఐదు సెషన్లుగా విభజిస్తారు. ఒక్కో సెషన్కు పది బాల్స్ కింద లెక్క క ట్టి బెట్టింగ్ను వసూల్ చేస్తారు. గెలుపోటములను బేరీజు వేస్తూ మరి కొందరి వద్ద బెట్టింగ్ ను నిర్వహిస్తారు. బెట్టింగ్ నిర్వహణ ద్వారా కమీషన్లను పొందుతారు. ఈ విషయాన్ని పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ కేంద్రంపై దృష్టిసారించారు. సుల్తాన్ బజార్, షాహినాయత్ గంజ్, రాంగోపాల్పేట్ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 మందిని అరెస్టు చేశారు. అరెస్టైయిన వారిలో సత్యప్రకాష్ జిందాల్ లియాస్ నక్కు కింద పనిచేసిన బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, అసిస్టెంట్లు గోవింద్రాఠి, జి.ప్రశాంత్కుమార్, ఎం.దిలీప్కుమార్, విజయ్ కుమార్ గోయెల్ అలియాస్ గోలు, రమేష్కుమార్ గోయెల్, లావనీస్ బన్సాల్, గోవిల్ మక్కార్, సాహిల్ ముంజాల్, ప్రిన్స్, కుమార్ కెవ్లీని, రాహుల్ కందాయ్, యశ్వంత్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్కు చెందిన ఆషూ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. ఆషూను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్, ఎస్సై ఎ.సుధాకర్, ఎస్ శేఖర్రెడ్డి, ఎ.రవి కుమార్, జి.రాజు, ఇతర కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.