జాగ్రత్తగా ఓటేయండి : సీఎం కేసీఆర్
రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కును అప్రమత్తంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.
పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచన
- తెలంగాణ భవన్లో రాష్ట్రపతి ఎన్నిక మాక్ పోలింగ్
- మంత్రి లక్ష్మారెడ్డి గైర్హాజరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి
- పోలింగ్లో ఎమ్మెల్యే షకీల్ తడబాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కును అప్రమత్తంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణభవన్లో ఆదివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. మాక్ పోలింగ్ అనంతరం సీఎం.. ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటింగ్లో అనుసరిం చాల్సిన వ్యూహం, పద్ధతులను వివరించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్కు రావాలని సూచిం చారు. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలని నిర్ణయించారు.
తర్వాత ఎమ్మెల్యేలంతా బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లి ఓటింగ్లో పాల్గొనాలన్నారు. టీఆర్ఎస్ తరఫున పోలిం గ్ ఏజెంట్లుగా కొప్పుల ఈశ్వర్, గంపా గోవర్ధన్ వ్యవహరించనున్నారు. మాక్ పోలింగ్కు మంత్రి లక్ష్మారెడ్డి గైర్హాజరయ్యారు. దీనిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి ముఖ్యమైన సమావేశాలకు రావాలి కదా అని అన్నట్టు సమాచారం. మాక్ పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ ఓటు వేయడంలో తడబడ్డా రు. నంబర్ వన్ వేయడానికి పైన కొమ్మును, కింద అడ్డగీత వేశారు. గమనించిన హరీశ్రావు నిలువుగా నంబర్ వేస్తే సరిపోతుందని, కొమ్ములు వద్దని సూచించారు.
విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోండి
టీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇటీవల నియామకమైన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను, విద్యార్థులకు జరిగిన మేలును క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేలా విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. విద్యార్థి విభాగం బలపడితే స్థానికంగా ఎమ్మెల్యేలకే రాజకీయంగా ఉపయోగపడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యార్థి విభాగానికి సభ్యత్వం సోమవారం నుంచి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి, పర్యవేక్షిస్తారని తెలిపారు.