లీకేజీ నిజమే..!

లీకేజీ నిజమే..! - Sakshi


 ఎంసెట్-2 వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక నిర్ధారణ

 ♦  ఐపీసీ 406, 408, 420, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు

 ♦  ప్రభుత్వ అనుమతితో పూర్తిస్థాయి విచారణకు సిద్ధమైన సీఐడీ

 ♦  రంగంలోకి ఆరు బృందాలు.. ఇప్పటికే పలు ఆధారాలు లభ్యం

 పలువురు జేఎన్టీయూ అధికారులు, ఫ్యాకల్టీ తీరుపై సందేహాలు

 ♦  అనుమానితులకు సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఏ కింద నోటీసులు!

 ♦  విద్యార్థుల తల్లిదండ్రులనూ ప్రశ్నించాలని నిర్ణయం


 

 సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అంశంలో ఐదు రోజులుగా రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. ఆయా అంశాలన్నింటితో ఎంసెట్-2 లీకేజీకి సంబంధించి లభించిన ప్రాథమిక ఆధారాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ అనుమతి తీసుకుని.. సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 406 (నమ్మకద్రోహం), 408 (ప్రభుత్వ ఉద్యోగి నమ్మకద్రోహం), 420 (చీటింగ్, మోసం) రెడ్‌విత్ 120బి, ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1987 (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్) సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో నిందితులెవరనేది చేర్చలేదు.

 

 దర్యాప్తులో కుట్రదారుల పాత్రను నిర్ధారించి వారి పేర్లను చేర్చాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. కేసు సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీ ఆరు బృందాలను రంగంలోకి దింపింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా సీఐడీ ఐజీ సౌమ్య మిశ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంసెట్-2 కౌన్సెలింగ్ వాయిదా పడిన నేపథ్యంలో కేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

 అనుమానితులకు నోటీసులు: ఎంసెట్-2 లీకేజీ ఆరోపణలపై ప్రాథమిక విచారణలో సహకరించని వారందరికీ నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా జేఎన్టీయూ అధికారులు సరిగా స్పందించలేదని ఆరోపణలున్నాయి. కొందరు జేఎన్టీయూ అధికారులు, ప్రశ్నపత్రం తయారు చేసిన ఫ్యాకల్టీ సభ్యులు దళారులతో మాట్లాడినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. దీనిపై ఆరా తీసేందుకు ఎవరిని ప్రశ్నించినా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. పైగా కొందరు ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు.



ఈ నేపథ్యంలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు జేఎన్టీయూ అధికారులను, ప్రశ్నపత్రం తయారు చేసిన ఫ్యాకల్టీలోని ఇద్దరు స భ్యులను పిలిచి మాట్లాడాలని సీఐడీ భావి స్తోంది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఇక ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను, ఆరోపణలు చేస్తున్న వారినీ పిలిచి సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద స్టేట్‌మెంట్లు నమోదు చేయనున్నారు. ఇక ఓ ఈశాన్య రాష్ట్రంలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఎంసెట్ -2 ప్ర శ్నపత్రాన్ని ముద్రించారు. అక్కడి నుంచి ప్రశ్నపత్రం లీకై ఉంటుందనే సందేహం మేరకు.. వారినీ విచారించాలని భావిస్తున్నారు.

 

 టెలికం కంపెనీలకు నోటీసులు

 బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సంభాషణల కాల్ రికార్డుల కోసం సీఐడీ అధికారులు టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. అధికారులు గుర్తించిన కాల్ లిస్టుల ప్రకారం దళారులు, జేఎన్టీయూ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఫోన్ సంభాషణలు చోటు చేసుకున్నాయి. పరీక్షకు వారం ముందు ఈ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో దళారులుగా చెలామణీ అవుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి జేఎన్టీయూ అధికారులకు పదే పదే ఫోన్లు ఎందుకు వెళ్లాయి, వారేం మాట్లాడుకున్నారనేది తేల్చాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. అలాగే కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు ముట్టజెప్పినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారి బ్యాంకు స్టేట్‌మెంట్లు తీసుకోవాలని సంబంధిత బ్యాంకు అధికారులను కోరనున్నారు.

 

 ఆరోపణలకు చేకూరుతున్న బలం

 ఎంసెట్-1లో తక్కువ ర్యాంకు వచ్చిన వారు ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకు సాధించడంతోపాటు, కొన్ని సందేహాస్పద ఘటనలు లీకేజీ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు పరీక్షకు వారం ముందే కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చి బెంగళూరు వెళ్లినట్లు గుర్తించారు. దీనిపై పలు ఆధారాలు కూడా సేకరించారు. ఎంసెట్-2లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. వాస్తవానికి ఎంసెట్-1 కంటే ఎంసెట్-2లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, అయినా ఎక్కువ మార్కులు వచ్చాయని సీఐడీ గుర్తించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top