బ్రెగ్జిట్‌తో భారత్‌కు నష్టం తక్కువే... | Brexit doesn’t do India any damage | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్‌తో భారత్‌కు నష్టం తక్కువే...

Jun 29 2016 8:05 PM | Updated on Sep 4 2018 5:21 PM

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయంతో భారత్‌కు ఒరిగే నష్టం తక్కువేనని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు.

- ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నాం
- ఆర్థిక రంగం మూలాలు బలంగా ఉన్నాయి..
- యూకేకు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలకు అవకాశం

సాక్షి, హైదరాబాద్

 యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయంతో భారత్‌కు ఒరిగే నష్టం తక్కువేనని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే బ్రెగ్జిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పకతప్పదని ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పదవ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.

 

సి.ఆర్.రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమ్యాటిక్స్, స్టాటస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అరవింద్ సుబ్రమణియన్ కీలకోపన్యాసం చేస్తూ భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు అనేక అంశాలపై విసృ్తతంగా మాట్లాడారు. బ్రెగ్జిట్ తదనంతరం రెండు రోజుల పాటు తాము అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని, కరెన్సీ ఒడిదుడుకులను నిశితంగా పరిశీలించిన తరువాత మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉందన్న అంచనాకు వచ్చామని అన్నారు. కాకపోతే బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం కొంచెం నెమ్మదించవచ్చునని చెప్పారు. మౌలికాంశాల పునాదులు దృఢంగా ఉన్నందున భారత్‌కు నష్టం తక్కువేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ కారణంగా భారత్ యునెటైడ్ కింగ్‌డమ్‌కు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలు జరిపే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.


కొత్త అంకెలపై అనుమానాలొద్దు..
స్థూల జాతీయోత్పత్తితోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన కొత్త ప్రమాణాలపై ఎవరూ అనుమానాలు పెట్టుకోనవసరం లేదని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలు, మచ్చలేని జాతీయ సమగ్రత దృక్పథంతో కూడిన నిపుణులు ఈ కొత్త గణాంకాలను తయారు చేశారని ఆయన అన్నారు. జీడీపీ వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు, నేతల ప్రమేయం ఉందన్నది అహేతుకమైందని స్పష్టం చేశారు. పైగా ఈ కొత్త గణాంకాల రూపకల్పనపై ఐదారేళ్లుగా కసరత్తు జరుగుతోందన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక శాఖకు సమాచార లభ్యత ఎంతో పెరగిందని, దాదాపు ఆరులక్షల కంపెనీల వివరాలను తాము సేకరించగలుగుతున్నామని వివరించారు.


సంపన్నుల సబ్సిడీల భారం రూ.76 వేల కోట్లు
2015-16 ఆర్థిక సర్వేపై డాక్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు ఎక్కువా? తక్కువా? అదే సమయంలో ప్రజల కోసం ఖర్చుపెడుతున్న మొత్తం ఎక్కువా? తక్కువ? అన్నది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అని, దీనికి సమాధానం కూడా వేర్వేరు రకాలుగా ఉంటుందని అన్నారు. అయితే పన్నుల సేకరణ విషయంలో మనం పాశ్చాత్యదేశాలతో పోలిస్తే చాలా దిగువన ఉన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. జీడీపీతో పోలిస్తే సేకరిస్తున్న పన్నులు 16.6 శాతం ఉండగా, ప్రపంచదేశాల సగటు 21.4 శాతంగా ఉందని, ఖర్చు పెట్టడంలోనూ ఇదే తీరు కనిపిస్తుందని వివరించారు.


జీఎస్‌టీతో పేద రాష్ట్రాలకు మేలు...
వస్తు, సేవ పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జీఎస్‌టీ) అమల్లోకి వస్తే దేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. మేకిన్ ఇండియా కావాలంటే... దేశం మొత్తాన్ని ఒకటిగా (పన్నుల విషయంలో) చేయాలని, జీఎస్‌టీ ఇందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాకుండా జీఎస్‌టీ అమల్లోకి వస్తే పన్నులు ఎగ్గొట్టే వారు తగ్గుతారని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందేందుకైనా వర్తకులు తాము కొనుగోలు చేసే ముడివస్తువులకు తగిన రసీదులు పొందుతారన్నది దీంట్లోని తర్కమని వివరించారు. కార్యక్రమంలో సి.ఆర్.రావు ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కాగ్నిజెంట్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ వైస్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణన్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.అప్పారావు, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ఆర్.రావు తదితరులు పాల్గొన్నారు. పదవ జాతీయ గణాంక దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాటస్టిక్స్ ఒలింపియాడ్ విజేతలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement