బెంగళూరు ‘ఏటీఎం ఉదంతం’తోపాటు నగరంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీల నేపథ్యంలో....
=తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న పోలీసులు
=మరికొన్ని విధివిధానాలు ఖరారు
=నెల రోజుల గడువిచ్చాం : కొత్వాల్ అనురాగ్ శర్మ
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు ‘ఏటీఎం ఉదంతం’తోపాటు నగరంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భత్రతా చర్యలపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో పాటు అదనపు కమిషనర్లు అంజనీ కుమార్ (శాంతిభద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), సంయుక్త కమిషనర్ (స్పెషల్బ్రాంచ్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇందులో బ్యాంకు అధికారులకు పోలీసులు చేసిన సూచనలివీ...
ఏటీఎం కేంద్రాల్లో ‘ప్యానిక్ అలారం’ ఏర్పాటు చేయాలి. లోపల ఉన్న వినియోగదారుడు ఏవైనా అనుమానాస్పద పరిణామం గమనిస్తే దీన్ని మోగిస్తే అంతా అప్రమత్తం అవుతారు.
ఈ కేంద్రాలకు ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పాదర్శకంగా ఉండి, లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి.
వీటి షట్టర్లు పటిష్టంగా ఉండటంతో పాటు సాధారణ వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కిందికి లాగే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలి.
ఏటీఎం కేంద్రం, బ్యాంకుల లోపల, బయట కచ్చితంగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని స్పష్టంగా చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి.
పబ్లిక్ అడ్రస్సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అప్రమత్తం చేయాలి.
బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల వద్దా కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరు సుశిక్షుతులై ఉండేలా చూడాలి.
పోలీసు అధికారులు సైతం తమ పరిధిలోని బ్యాంకులను నిత్యం సందర్శిస్తూ అవసరమైన సహాయసహకారాలు, సూచనలు అందించాలి.
నెల రోజుల గడువిచ్చాం : అనురాగ్ శర్మ
‘బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు నేరాల నివారణ కోసం బ్యాంకు అధికారులకు అనేక సూచనలు చేశాం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని కోరాం. నెల రోజుల పాటు గడువు ఇచ్చాం. అప్పటి లోగా అమలు కాకుంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’.