లక్కీ భాస్కర్.. ఈ సినిమా గురించి మనకు పరిచయమే. లక్కీ భాస్కర్ సినిమా థీమ్ ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ ఆర్థిక కష్టాలు, అప్పులు, అవమానాలు ఎదుర్కొని అక్రమ డబ్బు సంపాదనలోకి అడుగుపెట్టే కథ. డబ్బు దొంగతనం, మోసం, నేరం వంటి విషయాలను సీరియస్గా కాకుండా వ్యంగ్యంగా, వినోదాత్మకంగా చూపించారు ఈ సినిమాలో. ఇది సినిమా కాబట్టి ఆ హీరో చాకచక్యంగా తప్పించుకున్నట్లు మలిచారు. ప్రధానంగా లోభం, కుటుంబ బాధ్యతలు, నైతికతల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా అని చెప్పొచ్చు.
మరి నిజ జీవితంలో ఇలా చేస్తే దొరక్కుండా ఉంటారా?, కచ్చితంగా ఏదో ఒక రోజు దొరికి తీరుతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. అతనొక లక్కీ భాస్కర్ మాదిరే బ్యాంకుకు కన్నం వేశాడు,. ఒకటి, రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 8 కోట్లకు పైగా బ్యాంకు డబ్బును పట్టుకెళ్లిపోయాడు. గత 15 ఏళ్లుగా బ్యాంకులో జాయింట్ కస్టోడియన్గా పనిచేస్తున్న అతను.. భారీ మొత్తాన్ని బ్యాంకు నుంచి సర్దేశాడు. చివరకు దొరికేశాడు.
అసలు విషయంలోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేస్తున్న హర్షిద్ద్ కడియార్.. ఆర్బీఐ కరెన్సీ చెస్ట్(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక నగదు నిల్వ కేంద్రం) నుంఢి కోట్ల రూపాయలను దోచేశాడు.
Ahmedabad - In a major sensational heist, ₹8.70 crore has been stolen from the RBI Currency Chest of Bank of Baroda on Gandhi Road, with CCTV footage of the theft surfacing today.The accused, Harsiddh Kadiyar, who had been working as Joint Custodian in the bank for the past 15… pic.twitter.com/ceJHxktAIg
— NextMinute News (@nextminutenews7) May 25, 2026
2026 జనవరి 13వ తేదీ రాత్రి కట్టుదిట్టమైన భద్రత ఉన్న కరెన్సీ చెస్ట్ నుంచి కడియార్ ఒక పెట్టెలో స్క్రాప్ మెటీరియల్ను పారవేయడానికి బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అయితే అప్పటికే కోట్ల రూపాయలను అందులో సర్దేశాడు. బ్యాంకులో నమ్మకమైన వ్యక్తిగా ఉండటంతో ఆ కట్టుదిట్టమైన భద్రత వలయాన్ని కూడా తప్పించుకున్నాడు. తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ కరెన్సీ చెస్ట్లో రూ. 8.7 కోట్ల తేడా వచ్చింది. దాంతో ఆరా తీస్తే హర్షిద్ద్ కడియా ఆ పని చేసి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఆ తర్వాత యథావిధిగా బ్యాంకు వస్తూనే తన పనులు చేసుకుంటూ ఉన్నాడు హర్షిద్. మరొకవైపు ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల దృష్టికి వచ్చినా సైలెంట్గా ఉన్నారు. 90 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అవుతుందని నమ్మి, నిందితుడు మూడు నెలల పాటు యధావిధిగా విధులకు హాజరయ్యాడు.
అయితే సీసీ ఫుటేజ్ను తిరిగి రికవరీ చేయడంతో అతగాడి విషయం బయటపడింది. ఇప్పుడు ఆ ఫుటేజ్ లభ్యం కావడంతో అది కేసులో కీలక సాక్ష్యంగా మారింది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీస్ అధికారులు.. కడియార్కు సహచరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు దొంగిలించిన నగదును ఎక్కడకి తరలించి ఉండవచ్చు అనే దానిపై ఆరా తీస్తున్నారు.


