తాపీ, సున్నం, రాళ్లబండి... | Sahitya Marmaralu By Vandrangi Kondala Rao In Sakshi | Sakshi
Sakshi News home page

Nov 19 2018 12:34 AM | Updated on Nov 19 2018 12:34 AM

Sahitya Marmaralu By Vandrangi Kondala Rao In Sakshi

రచయితలు తాపీ ధర్మారావు, సున్నం వీర్రాజు, రాళ్లబండి కుటుంబరావు తదితరులు 1966లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని కలిశారు. విశాఖపట్నంలో ‘కవితా సమితి’ శాశ్వత భవన నిర్మాణానికి ‘కాసు’ల కోసం ఆయన్ని సంప్రదించారు. సాహిత్యవేత్త కాకపోయినప్పటికీ బ్రహ్మానందరెడ్డి ఛలోక్తులు విసరడంలో దిట్ట. ‘ఖజానాలో కాసుల కొరత ఏర్పడింది’ అని చెబుతూ– ‘సున్నం’ ఉండీ, ‘తాపీ’ ఉండీ, 
‘రాళ్లబండి’ కూడా ఉండీ సొంతభవనం నిర్మించుకోలేరా? అని హాస్యమాడారు. మరోసారి చూద్దాం లెండని పంపేశారు.  రచయితల ఇంటిపేర్ల తమాషా ఇది.
ఈమధ్యే నిర్యాణం చెందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంచి సాహితీవేత్త. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉద్యోగులు జీతాలు పెంచి తమను ‘కరుణి’ంచండని ఓ అర్జీని సమర్పించారు. అందుకు ఆయన నవ్వుతూ– ‘కరుణ’ ఉంది కానీ ‘నిధి’ లేదు అని బదులిచ్చి, ఖజానా పరిస్థితి మెరుగైనప్పుడు చూద్దామన్నారు. ఉద్యోగులు పేషీ నుంచి నిష్క్రమించారు.
వాండ్రంగి కొండలరావు

Advertisement
 
Advertisement
Advertisement