శ్రమకు తగ్గ ఫలితం ఉండట్లేదా..?

panyala jagannatha das about spiritual information

వృత్తి ఉద్యోగాల్లో ఎంతగా శ్రమిస్తున్నా ఉన్నతి సాధించలేకపోతుంటారు కొందరు. మెరుగైన పనితీరు, చిత్తశుద్ధి వంటి లక్షణాలను కలిగి ఉన్నా తగిన పదోన్నతులు, వేతన ప్రతిఫలాలను పొందలేకపోతుంటారు. జాతకంలో శని అనుగ్రహం లోపించినప్పుడు, రాజ్యాధిపతి, రాజ్య భావం బలహీనపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ స్థితిని అధిగమించడానికి కొన్ని తేలికపాటి పరిహారాలు.

శనికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు. పదోన్నతులు, వేతన ప్రతిఫలాలు ఆశించిన స్థాయిలో దక్కనందుకు నిరాశ అనిపించినా, కుంగిపోవద్దు. పనితీరుపై శ్రద్ధ తగ్గించవద్దు. చిత్తశుద్ధితో విధి నిర్వహణ కొనసాగిస్తూనే, శని ప్రీతి కోసం ప్రతిరోజూ ఉదయం కాకులకు ఆహారం తినిపించండి. ఆ తర్వాతే మీరు ఆహార పానీయాలను తీసుకోండి.

ఆర్థిక ఉన్నతికి గురుబలం అత్యంత కీలకం. వృత్తి ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లయితే గురువును ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతి గురువారం గోవులకు పచ్చటి గ్రాసం, అరటిపండ్లు తినిపించండి. గురువులకు, గురుతుల్యులకు యథాశక్తి కానుకలు సమర్పించి, వారి ఆశీస్సులు పొందండి.

ఆశలు అడుగంటిపోతున్న స్థితిలో గ్రహబలానికి మించి దైవబలం మిన్నగా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ ఆలయాన్ని దర్శించుకుని, ఆంజనేయ విగ్రహం కుడికాలి బొటనవేలి వద్ద సిందూరాన్ని సేకరించి, నుదుట తిలకంగా దిద్దుకోండి.

ప్రతినెలా ఏదైనా గురువారం ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయానికి తీపి గుమ్మడికాయను సమర్పించుకోండి. అలాగే ఆలయ పూజారులకు లేదా పురోహితులకు వస్త్రదానం చేయండి. మేనత్తలకు, అక్కచెల్లెళ్లకు చిన్నపాటివైనా కానుకలు ఇచ్చి వారికి సంతోషం కలిగించండి. వారికి కానుకలు ఇవ్వడానికి సందర్భాలతో నిమిత్తం లేదు. చదువు కోసం సాయం కోరే ఆడపిల్లలకు లేదనకుండా శక్తిమేరకు ఆర్థిక సాయం చేయండి.

– పన్యాల జగన్నాథ దాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top