కొప్పుముడి ఖడ్గధారి | First Sikh Women Anmol Narang Graduate From US Military Academy | Sakshi
Sakshi News home page

కొప్పుముడి ఖడ్గధారి

Jun 15 2020 8:24 AM | Updated on Jun 15 2020 8:24 AM

First Sikh Women Anmol Narang Graduate From US Military Academy - Sakshi

అమెరికన్‌ మిలటరీలో రాణీ రుద్రమ! ఫస్ట్‌ ‘అబ్జర్వెంట్‌’ సిక్కు గ్రాడ్యుయేట్‌. సైన్యానికి తన రూల్స్‌ ఉన్నాయి. ఆమెకు తమ ఆచారాలు ఉన్నాయి. ఆమె కోసం సైన్యం తనని మార్చుకుంది. ఖఢ్గం అమెరికాది. కొప్పు ఆమెది. వ్యక్తిగా తనని నిలుపుకుంటూనే..సైనిక శక్తిగా నిలబడింది అన్మోల్‌!!

సైన్యం సైన్యంలా ఉండాలన్నది అమెరికన్‌ పాలసీ. సైన్యంలో స్త్రీలు ఉండొచ్చు. పురుషులు ఉండొచ్చు. ట్రాన్స్‌జెండర్‌లు ఉండొచ్చు. వివిధ మతాల వారు ఉండొచ్చు. ప్రధానంగా మాత్రం వారంతా సైనికులు. ఆచారాలు ఉంటే పక్కన పెట్టేయాలి. తలజుట్టు కత్తిరించుకోనంటే ఆర్మీలో చేరాలన్న ఆశల్ని కత్తిరించుకోవలసిందే. గడ్డం ఉండాల్సిందే అనుకుంటే ఆర్మీ కెరీర్‌కీ దూరంగా ఉండాల్సిందే. అయితే శనివారం న్యూయార్క్, వెస్ట్‌ పాయింట్‌లోని యు.ఎస్‌.మిలటరీ అకాడెమీలో జరిగిన ‘గ్రాడ్యుయేషన్‌ సెర్మనీ’లో హ్యాట్‌ను పైకి ఎగరేసిన పట్టుకున్న ఒక యువతి.. మిలటరీ డ్రెస్, చేతిలో ఖడ్గంతో పాటు కొప్పుముడితో సాక్షాత్కరించింది! అమెరికన్‌ ఆర్మీలో ఆచార పరాయణత్వాన్ని ప్రతిఫలింపజేసిన ఆ సిక్కు మహిళ.. అన్మోల్‌ నారంగ్‌ (23). అయితే తనేమీ నిబంధనలకు మినహాయింపు పొంది ఆకాడెమీలో చేరలేదు. మోకాళ్ల వరకు ఉండే తన జుట్టును నిబంధనలకు లోబడే మూడున్నర అంగుళాల చుట్టుకొలతను మించని కొప్పుగా ముడి వేసుకుని ‘క్యాడెట్‌’ శిక్షణ పూర్తి చేసింది. పట్టాతో పాటు, యు.ఎస్‌. మిలటరీ అకాడమీలో ‘ఫస్ట్‌ అబ్జర్వెంట్‌ ఫిమేల్‌ సిఖ్‌ గ్రాడ్యుయేట్‌’ గా గుర్తింపు పొందింది. 2017లో యు.ఎస్‌. మిలటరీ తన నిబంధనలను సడలించాక అబ్జర్వెంట్‌గా (ఆచారాలను వదలని సైనికురాలిగా) అకాడమీ నుంచి డిగ్రీతో బయటికి వచ్చిన తొలి సిక్కు మహిళ అన్మోల్‌ నారంగ్‌. ఇప్పటికే ఆమె అమెరికా సైన్యంలో ‘సెకండ్‌ లెఫ్ట్‌నెంట్‌’ హోదాలో ఉంది. ఇప్పుడిక కొత్తగా వచ్చిన డిగ్రీతో ‘బేసిక్‌ ఆఫీసర్‌ లీడర్‌షిప్‌ కోర్సు’ కూడా పూర్తి చేస్తే 2021 జనవరిలో జపాన్‌లోని ఓకినావాలో ఉన్న అమెరికన్‌ బేస్‌లో హై ర్యాంక్‌ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించవచ్చు.

అన్మోల్‌ అమెరికాలోనే పుట్టింది. జార్జియాలోని రాస్వెల్‌లో స్థిరపడిన రెండో తరం భారతీయ సంతతి కుటుంబంలోని అమ్మాయి అన్మోల్‌. తాతగారు (అమ్మవాళ్ల నాన్న) భారత సైన్యంలో చేశారు. అయితే సైన్యంలో చేరాలన్న అన్మోల్‌ ఆశలు ఆయన్నుంచి చిగురించలేదు. హైస్కూల్‌లో ఉండగా తల్లిదండ్రులతో కలిసి హానలూలు లోని ‘పెరల్‌ హార్బర్‌ నేషనల్‌ మెమోరియల్‌’ చూడ్డానికి Ðð ళ్లింది అన్మోల్‌. 1941 డిసెంబర్‌ 7 ఉదయం హానలూలు లోని పెరల్‌ హార్బర్‌లో ఉన్న అమెరికన్‌ నావికా స్థావర ంపై జపాన్‌ నౌకాదళం వైమానిక దాడులు జరిపింది. ఆ దాడిలో రెండు వేలమందికి పైగా అమెరికన్‌లు చనిపోయారు. మరో రెండు వేల మంది గాయపడ్డారు. అప్పటి వరకు తటస్థంగా ఉన్న అమెరికా పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడితో రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగవలసి వచ్చింది. మెమోరియల్‌లో ఆనాటి యుద్ధ జ్ఞాపకాలను చూస్తున్న అన్మోల్‌ ఆ క్షణమే అనుకుంది అమెరికన్‌ ఆర్మీలో చేరాలని. చేరడమే కాదు, తన ‘శత్రుదేశం’ జపాన్‌ని హద్దులో ఉంచడానికి అమెరికా సైనికాధికారిగా కూడా వెళ్లబోతోంది.
వెస్ట్‌ పాయింట్‌లో చేరడానికి ముందు జార్జియాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సు చేసింది అన్మోల్‌. న్యూక్లియర్‌ ఇంజినీరింగ్, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఆమె సబ్జెక్టులు. ‘‘వెస్ట్‌ పాయింట్‌లో డిగ్రీ చెయ్యాలన్న నా కల ¯ð రవేరింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిలటరీలోని నిబంధనల సడలింపునకు అమెరికాలోని ‘సిక్కు కోఎలిషన్‌’ సంస్థ చేసిన పదేళ్ల పోరాటం నా కలను నెరవేర్చాయి’’ అంటోంది అన్మోల్‌ నారంగ్‌.      

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్‌లకు వారి తల్లిదండ్రులకు బదులుగా సైనికాధికారులు, వారి సతీమణులు ‘మిలటరీ స్టార్‌’లు తొడిగారు.
ఆఫీసర్‌లే అమ్మానాన్నలు!
యు.ఎస్‌. మిలటరీ అకాడమీలో ‘గ్రాడ్యుయేట్‌ సెర్మనీ’ జరిగిన రోజే మన డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. అక్కడి అకాడమీలో అన్మోల్‌ నార ంగ్‌ తన మత సంప్రదాయాన్ని నిలబెట్టుకున్న తొలి సిక్కు మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తింపు పొందితే.. ఇక్కడి అకాడమీ.. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు గ్రాడ్యుయేట్‌ల తల్లిదండ్రులను ఆహ్వానించే సంప్రదాయాన్ని కరోరా కారణంగా నిలుపుకోలేకపోయింది. తల్లిదండ్రులకు బదులుగా భారత సైనిక అధికారులు, వారి సతీమణులు పట్టభద్రులైన యంగ్‌ ఆఫీసర్‌ల భుజాలకు స్టార్‌లను తొడిగారు. అమెరికన్‌ మిలటరీ అకాడమీ నుంచి 1100 మంది, ఇండియన్‌ మిలటరీ అకాడమీ నుంచి 423 మంది శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement