వైఎస్ కృషివల్లే దేశమంతా రుణమాఫీ:విజయమ్మ | ys rajasekhara reddy favour to farmers | Sakshi
Sakshi News home page

వైఎస్ కృషివల్లే దేశమంతా రుణమాఫీ:విజయమ్మ

Apr 24 2014 1:45 AM | Updated on Oct 22 2018 9:16 PM

వైఎస్ కృషివల్లే దేశమంతా రుణమాఫీ:విజయమ్మ - Sakshi

వైఎస్ కృషివల్లే దేశమంతా రుణమాఫీ:విజయమ్మ

‘‘రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి. అందుకే 2004లో ముఖ్యమంత్రి కాగానే రైతుల రుణమాఫీకోసం పట్టుబట్టారు. కేంద్రంలో సోనియా, మన్మో హన్‌సింగ్‌లను ఒప్పించి అమలు చేసేందుకు మూడేళ్లు పట్టింది.

తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్ జనభేరి సభల్లో విజయమ్మ
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి. అందుకే 2004లో ముఖ్యమంత్రి కాగానే రైతుల రుణమాఫీకోసం పట్టుబట్టారు. కేంద్రంలో సోనియా, మన్మో హన్‌సింగ్‌లను ఒప్పించి అమలు చేసేందుకు మూడేళ్లు పట్టింది. చివరకు రాజశేఖరరెడ్డి మాట కోసం 2008లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఆనాడు 65 వేల కోట్లు రుణమాఫీ చేస్తే మన రాష్ట్రానికి 12 వేల కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. అప్పటికే రుణాలు చెల్లించినవారు నష్టపోకూడదని రాజశేఖరరెడ్డి వారికి రూ.5 వేల చొప్పున ఇచ్చారు. జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాలకు నీరందించాలని. 12 ప్రాజెక్టులు పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. 30 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. ఆయన బ్రతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయి ఉండేది. ఇప్పుడైనా జగన్‌ను సీఎం చేసుకుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ ప్రాంత పొలాల్లో బంగారం పండుతుంది’’ అని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ చెప్పారు.
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ బుధవారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజక వర్గాల్లో పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘రాజశేఖరరెడ్డి భార్యగా, జగన్ తల్లిగా ఒక్కటైతే చెబుతున్నా. రాజశేఖరరెడ్డి మన మధ్యనుంచి వెళ్లిపోయిన తర్వాత నాకు ఆ లోటు ఎవరూ తీర్చలేరు. నేను చస్తే కానీ తీరదు. కానీ  మీకు మాత్రం ఆ లోటు జగన్ తీరుస్తాడు. మీ కష్టంలో, సుఖంలో మీ అందరికీ తోడుంటాడు. వాళ్ల నాయనలా జగన్‌కు కూడా పెద్ద మనసుంది. అందువల్లే అధికారంలోకి రాగానే మొదటిరోజే గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, మరో రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. రైతులకు పగటి పూటే ఏడు గంటలు విద్యుత్ అందిస్తానని చెప్పాడు. ఇంకా ఎన్నో మేళ్లు చేస్తాడు. నా బిడ్డను మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరినీ గెలిపించండి’’ అని పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు, ముఖ్యంగా రాజమండ్రివాసులు తన కుటుంబంపై చూపిన ప్రేమను గుండెల్లో దాచుకుంటానని చెప్పారు. జిల్లాలో మూడు రోజులు నిర్వహించిన వైఎస్సార్ జనభేరి బుధవారం రాత్రి రాజమండ్రి సిటీలో ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement