తెలుగువారి ఓట్లే కీలకం | the key role of telugu people's votes | Sakshi
Sakshi News home page

తెలుగువారి ఓట్లే కీలకం

Apr 7 2014 10:41 PM | Updated on Aug 29 2018 8:54 PM

పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో జిల్లాలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో బరిలోకి దిగిన ఆయా పార్టీ అభ్యర్థులతోపాటు కార్యకర్తల్లో అలజడి మొదలైంది.

 పుణే సిటీ, న్యూస్‌లైన్: పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో జిల్లాలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో బరిలోకి దిగిన ఆయా పార్టీ అభ్యర్థులతోపాటు కార్యకర్తల్లో అలజడి మొదలైంది. పుణే నియోజక వర్గం నుంచి ఇప్పటికి మూడు దఫాలు ఎంపీగా ఎన్నికైన సురేష్ కల్మాడీ కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణంలో చిక్కుకోవడంతో ఈ టికెట్ విశ్వజిత్ కదమ్‌కు లభించింది. నగరంలో 50 శాతం మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు చెందినవారే కావడం కల్మాడీకి అనుకూలంగా పరిణమించింది. అయితే దీర్ఘకాలంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉండటంతో ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ వ్యతిరేకతను బీజేపీ కూటమి, ఎమ్మెన్నెస్‌లు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఎన్సీపీ ప్రచారం అది మేరకు సఫలీకృతమవుతుందనే విషయం తెలియాలంటే ఫలితాలు వెలువడేదాకా ఆగాల్సిందే. పుణే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వడగావ్ శేరి, పుణే కంటోన్మెంట్, పార్వతి, కోత్‌రోడ్, కసబా, శివాజీ నగర్ శాసనసభ స్థానాలున్నాయి. పుణేలో దాదాపు 60 వేలమందికిపైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. నగరంలో భవానీపేట్, గంజ్ పేట్, పులే వాడా, బిబేవాడి, ఘోర్పడి, భైరోభానల, పుణే క్యాంపు, కోరేగావ్ పార్క్, ఔంద్, వడగావ్ శేరి తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు.

 ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫునఅనిల్ శిరోలే , కాంగ్రెస్ నుంచి విశ్వజిత్ కదమ్, ఎమ్మెన్నెస్ నుంచి దీపక్ పాయగుడే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుభాష్ వారేలు బరిలోకి దిగారు. అదేవిధంగా పుణే మున్సిపల్ మాజీ కమిషనర్ అరుణ్ భాటియాతోపాటు కల్నల్ సురేష్ పాటిల్ ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 2009 ఎన్నికల్లో అనిల్ శిరోలే 25 వేల ఓట్ల తేడాతో సురేష్ కల్మాడీపై ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సురేష్ కల్మాడీకే గట్టి పోటి ఇచ్చిన అనిల్ శిరోలే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని భావిస్తున్నారు.
 పుణే పట్టణంలో తెలుగువారు ఏవైపు మొగ్గు చూపితే వారినే విజయలక్ష్మి వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో నగరపరిధిలో నివసిస్తున్న తెలుగువారు తమ మనోభావాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement