జడ్‌పీ పీఠంపైఎవరో? | local body elections campaign started | Sakshi
Sakshi News home page

జడ్‌పీ పీఠంపైఎవరో?

Mar 26 2014 12:56 AM | Updated on Oct 17 2018 6:06 PM

జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారఘట్టం మొదలైంది. 36 జడ్‌పీటీసీల కు 195 మంది, 583 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారఘట్టం మొదలైంది. 36 జడ్‌పీటీసీల కు 195 మంది, 583 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఉండగా, స్వతంత్రులు, ఇతరులకు గుర్తుల కేటాయింపు జరిగిపోయింది. ప్రచారం హోరెత్తుతోంది. అయినప్పటికీ ప్రధాన పార్టీలు జడ్‌పీ ైచైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం లేదు. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని భావిస్తుండగా, ప్రధాన పార్టీల నాయకులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై పార్టీ కేడర్‌లో అసహనం వ్యక్తం అవుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లోను ఇదే పరిస్థితి నెలకొంది.

 ఆనవాయితీ తప్పిన పార్టీలు
 జడ్‌పీటీసీ సభ్యులు ఎన్నికయ్యాక వారంతా కలిసి ైచైర్మన్‌ను ఎన్నుకుంటారు. అయినా ఆయా పార్టీలు ైచైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీ. అయి తే సార్వత్రిక ఎన్నికల తర్వాత మున్సిపల్, ‘స్థానిక’ ఎన్నికలు ఉంటాయని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేతలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్లు షాక్ ఇచ్చాయి. ఆర్థిక అంచనాలు ఒక్కసారిగా తలకిందులు కావడం తో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయాలనుకుం టున్న నాయకులు మున్సిపల్, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అనాసక్తిగా ఉన్నారంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్లు, జడ్‌పీ ైచైర్మన్, ఎంపీపీలను ముందుగానే ప్రకటించే సాహసం చేయడం లేదు. ఇదిలా వుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి 36 మండలాలకు జడ్‌పీటీసీ అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవరికీ వారు తామే జడ్‌పీ ైచైర్మన్ కాబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కేడర్ అయోమయానికి గురవుతోంది. టీఆర్‌ఎస్ సైతం 36 మందిని బరిలోకి దింపగా, బీజేపీ31, టీడీపీ 29 మంది అభ్యర్థులను  పోటీలో నిలిపింది. వైఎస్‌ఆర్ సీపీ, సీసీఐ, సీపీఎం, లోక్‌సత్తాల అభ్యర్థులు పోటీ లో ఉన్నారు.

 అందరికీ పరీక్షా సమయమే
 బీసీ జనరల్‌కు కేటాయించిన జిల్లా పరిషత్ ైచైర్మన్ పదవి ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలే. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు ముఖ్య నేతలకు ఇప్పటికే ప్రతిష్టాత్మకం కాగా, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. జిల్లాలో రాజకీయ ఉద్ధండులుగా పేరున్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీల సీనియర్లకు ఎటూ పాలుపోవడం లేదు.

పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్, మాజీ మంత్రులు పి.సుదర్శన్ రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీడీపీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులకు జడ్‌పీ ఎన్నికలు కీలకమే.

 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఒక నెల ముందుగానే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు...22 రోజుల ముందు జడ్‌పీటీసీ, ఎంపీటీసీల పోరు జరగడం రాజకీయ పార్టీల్లో సర్వత్రా చర్చనీయాంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement