కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో గత ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో గత ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జిల్లాలో 12 శాసనసభా నియోజకవర్గాలుండగా..నాడు 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన ఆ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి వంటి వాళ్లు అనేక మంది వచ్చి ప్రచారం చేశారు. అంత చేసినా..కనిగిరి తప్ప ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వేల ఓట్లు కూడా సంపాదించలేకపోయారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కనిగిరిలో 2603 ఓట్లు పోలవ్వగా.. కనిష్టంగా కందుకూరులో 641 ఓట్లు వచ్చాయి. ఒంగోలులో 1424, అద్దంకిలో 1387, గిద్దలూరులో 1933, దర్శిలో 1177, మార్కాపురంలో 1550, యర్రగొండపాలెంలో 1322, కొండపిలో 1081, పర్చూరులో 1275 ఓట్లు, సంతనూతలపాడులో 1263, చీరాలలో 974 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇటువంటి ఓటింగ్ పొందిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. పోటీ చేసిన వారికి ప్రచారం కోసం నిధులిస్తారని భావించి కొంత మంది ముందుకొచ్చారు. అయితే అదికూడా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ప్రచారం సైతం చేయకుండా ఇంట్లో కూర్చున్నారు.
ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చిరంజీవి గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆయన సభలకు వచ్చారు. ఈ ఎన్నికలకు జనం లేక కొన్ని సభలను రద్దు చేసుకుని చిరంజీవి వెళ్లిపోయారు.
అయితే తమ పార్టీ పుంజుకుంటుందని, ఈ ఎన్నికల్లో సమస్యలేర్పడినా..వచ్చే ఎన్నికల సమయానికి ఊపందుకుంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. టీడీపీ పాలనకు ప్రజలు భయపడే రోజులు దగ్గరలోనే ఉందని, దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకుంటుందని అంటున్నారు.