టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ | Times World Rankings | Sakshi
Sakshi News home page

టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్

Oct 3 2016 3:13 AM | Updated on Sep 4 2017 3:55 PM

టైమ్స్ వరల్డ్  ర్యాంకింగ్స్

టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్

పపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) సంస్థ వెల్లడించే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్

 పపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) సంస్థ వెల్లడించే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంతర్జాతీయంగా వివిధ విద్యాసంస్థల్లోని ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఉన్నత విద్యాభ్యాసానికిసరితూగే ఇన్‌స్టిట్యూట్ల అన్వేషణకు ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకునేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది.ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో మన దేశం నుంచి 31 సంస్థలు చోటు సంపాదించగా,వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 వర్సిటీలు  ఉన్నాయి. ఈ క్రమంలో ‘టైమ్స్’ ర్యాంకింగ్స్‌పై ఫోకస్..
 
 జాతీయ స్థాయిలో 31 ఇన్‌స్టిట్యూట్లు
 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల్లో భారత్ నుంచి 31 విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్సీ.. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల ఇన్‌స్టిట్యూట్లు నిలిచాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఏప్రిల్‌లో విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో లేని విద్యాసంస్థలు, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో చోటు దక్కని విశ్వవిద్యాలయాలు సైతం ‘టైమ్స్’ ర్యాంకుల లిస్టులో ఉండటం గమనార్హం.
 
 తెలుగు రాష్ట్రాల నుంచి 4 వర్సిటీలు
 ‘టైమ్స్’ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 4 యూనివర్సిటీలు చోటు సంపాదించాయి. ప్రపంచ వ్యాప్తంగా 978 వర్సిటీలకు, ఇన్‌స్టిట్యూట్లకు ర్యాంకులు కేటాయించగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వర్సిటీలు 601 నుంచి 801+ శ్రేణిలో నిలిచాయి. వాటి వివరాలు.. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) 601-800 శ్రేణిలో; ఆచార్య నాగార్జున, ఆంధ్రా, ఉస్మానియా వర్సిటీ (ఓయూ) 801+ శ్రేణిలో నిలిచాయి (వీటిలో ఎస్వీయూ, ఓయూ.. ఎంహెచ్‌ఆర్‌డీ ర్యాంకులను కూడా పొందాయి).
 
 జాతీయ స్థాయిలో ఐఐఎస్సీ టాప్
 ‘టైమ్స్’ ర్యాంకులు పొందిన భారతీయ విద్యాసంస్థల్లో బెంగళూరులోని ఐఐఎస్సీ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం ర్యాంకుల జాబితాలో ఈ సంస్థ 201-250 శ్రేణిలో నిలిచింది.
 
 ఈ లిస్ట్‌లోని టాప్-10 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ..
 ఐఐఎస్సీ బెంగళూరు (201-250); ఐఐటీ ముంబై (351-400); ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ చెన్నై (401-500), ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, జాదవ్‌పూర్ వర్సిటీ (501-600), అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలాని (601-800). ఈ జాబితాలోని ఐఐటీలను మినహాయిస్తే మరో రెండు ఐఐటీలు (రూర్కెలా, గువహటి) మాత్రమే ‘టైమ్స్’ ర్యాంకుల్లో 601-800 ర్యాంకు శ్రేణిలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
 
 ర్యాంకుల నిర్ధారణకు ప్రమాణాలు
 ర్యాంకుల నిర్ధారణకు టైమ్స్ సంస్థ ఐదు ప్రమాణాలను పాటించింది. ఒక్కో పారామీటర్‌కు నిర్దిష్టంగా కొన్ని పాయింట్లు కేటాయించింది. అవి..
 
 1. టీచింగ్-30    2. రీసెర్చ్-30
 3. సైటేషన్స్-30,    4. ఇంటర్నేషనల్ ఔట్‌లుక్-7.5,
 5. ఇండస్ట్రీ ఇన్‌కమ్-2.5
 ఒక్కో పారామీటర్‌లో కొన్ని ఉప విభాగాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా సదరు ఇన్‌స్టిట్యూట్లకు స్కోర్లు ఇస్తారు. వివరాలు..
 
 1.టీచింగ్: ఫ్యాకల్టీ పరంగా గుర్తింపు-15 శాతం; ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి-4.5 శాతం; పీహెచ్‌డీ-బ్యాచిలర్ విద్యార్థుల నిష్పత్తి-2.25 శాతం; డాక్టరేట్ ఫ్యాకల్టీ నిష్పత్తి-6 శాతం; ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌కమ్-2.25 శాతం
 2.రీసెర్చ్: రీసెర్చ్ రెప్యుటేషన్-18 శాతం; రీసెర్చ్ ఇన్‌కమ్-6 శాతం; రీసెర్చ్ ఫలితాలు-6 శాతం
 
 3.సైటేషన్స్: ఆయా విభాగాల్లో డాక్టోరల్ అభ్యర్థులు, ఫ్యాకల్టీ సభ్యులు రీసెర్చ్ జర్నల్స్‌లో ప్రచురించిన సైటేషన్స్‌కు నిర్దేశించిన పారామీటర్ ఇది. గత ఐదేళ్ల కాలంలో స్కోపస్ డేటాబేస్‌లో నిక్షిప్తమైన 23 వేల అకడమిక్ జర్నల్స్, ఎల్సెవియర్ డేటా, ప్రపంచ వ్యాప్తంగా 56 మిలియన్ల సైటేషన్ల ఆధారంగా ఈ పారామీటర్‌లో ఇన్‌స్టిట్యూట్‌కు గరిష్ట స్కోర్ కేటాయించారు.
 
 4.ఇంటర్నేషనల్ ఔట్‌లుక్: అంతర్జాతీయ గుర్తింపు, విద్యార్థులు, అధ్యాపకులు, అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో సదరు యూనివర్సిటీల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఆధారంగా ఈ పారామీటర్‌కు స్కోర్ కేటాయించారు. ఇందులో పరిగణనలోకి తీసుకునే అంశాలు.. అంతర్జాతీయ-జాతీయ విద్యార్థుల నిష్పత్తి-2.5 శాతం; అంతర్జాతీయ-జాతీయ అధ్యాపక నిష్పత్తి-2.5 శాతం; అంతర్జాతీయ ఒప్పందాలు-2.5 శాతం.
 
 5.ఇండస్ట్రీ ఇన్‌కమ్: సదరు ఇన్‌స్టిట్యూట్లు ఇండస్ట్రీ వర్గాలకు అవసరమైన పరిశోధన కార్యకలాపాలను నిర్వహించిన తీరు, వాటి ద్వారా లభించిన ఆదాయం ఆధారంగా ఈ పారామీటర్‌కు స్కోర్లు కేటాయించారు.
 
 రెండు పారామీటర్లలో వెనుకంజ
 ‘టైమ్స్’ ర్యాంకుల్లో భారతీయ విద్యాసంస్థలు రీసెర్చ్, సైటేషన్స్‌లో వెనుకబడ్డాయి. 50 శాతం స్కోర్ కూడా పొందలేకపోయాయి. ఐఐఎస్సీ-బెంగళూరు కూడా పరిశోధనలో 49.2; సైటేషన్స్‌లో 47.3 శాతం స్కోర్లే సాధించింది. ఐఐటీ ముంబై.. రీసెర్చ్ పారామీటర్‌లో 31.1 శాతం స్కోర్‌కే పరిమితమైంది.
 
 మెరుగైన ర్యాంకులు పొందేందుకు కృషి..
 స్టేట్ వర్సిటీలు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ పారామీటర్లలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సైటేషన్స్, రీసెర్చ్ పారామీటర్లలో వీలైనన్ని ఒప్పందాలు చేసుకొని, తద్వారా మంచి ర్యాంకులు పొందేందుకు కృషిచేస్తాం.
 - ప్రొఫెసర్ కె.జాన్‌పాల్, రిజిస్ట్రార్, ఏఎన్‌యూ
 
 రీసెర్చ్‌కుప్రాధాన్యమిస్తాం..
 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకు దక్కించుకోవడం హర్షణీయం. ఇకపై అన్ని ర్యాంకింగ్స్‌లో ఏటా నిలిచేందుకు కృషిచేస్తాం. పరిశోధనకు ప్రాధాన్యం పెరిగేలా చర్యలు తీసుకుంటాం.     - ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, వీసీ, ఓయూ
 
 రెండు పారామీటర్లపై దృష్టి సారిస్తాం..
 ఇంటర్నేషనల్ స్టూడెంట్, ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి పరంగా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. వీటి ద్వారా భవిష్యత్తులో అన్ని సంస్థల ర్యాంకింగ్స్‌లో మరింత ముందంజ వేసేందుకు కార్యాచరణ      చేపడతాం.  - ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్, ఏయూ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement