కరెంట్ షాక్‌తో.. ఇద్దరు రైతులు దుర్మరణం | Two farmers killed in the current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో.. ఇద్దరు రైతులు దుర్మరణం

Jul 10 2016 5:07 PM | Updated on Sep 5 2018 2:26 PM

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలు తీసింది.

- ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణం
- విద్యుత్ ఏఈ ఘెరావ్
- సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఖేడ్ సీఐ
- ప్రభుత్వం నుంచి రూ.4లక్షలు
- మరో రెండు లక్షలు సాయం చేయనున్న ఎమ్యెల్యే బాబూమోహన్
రేగోడ్ (మెదక్ జిల్లా)

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలు తీసింది. బహిర్భూమికి వెళుతూ ఒకరు.. అతన్ని కాపాడబోతూ మరొక రైతు ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఉసిరికపల్లి గ్రామ పంచాయతీలోని దరఖాస్తుపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది.

బాధిత కుటుంబాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉసిరికపల్లి గ్రామానికి చెందిన మంతూరి కిష్టయ్యకు నాలుగుఎకరాల భూమి ఉంది. మంతూరి ఫీరయ్యకు ఒక ఎకరం భూమి ఉంది. అన్నదమ్ముల పిల్లలైన కిష్టయ్య, ఫీరయ్యలు వరుసకు కూడా ఇద్దరు అన్నద మ్ములు. ఉన్న భూమిలో పత్తి, కంది, పెసర పంటలను సాగు చేశారు. వ్యవసాయం చేస్తూ కూడా కూలీ పనులు చేసుకుంటూ కుటుంభాన్ని పోషించేవారు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం బహిర్బూమికి ఫీరయ్య (45) వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కిందపడిన తీగలను గమనించని ఫీరయ్య అడుగు పెట్టాడు. ఇది గమనించిన కిష్టయ్య (35) దుప్పటి సాయంతో ఫీరయ్య ను కాపాడ బోయాడు.. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

 స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రాంరెడ్డి, కాంగ్రెస్ నేత సూర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనీయర్ నాయకుడు వీరారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ సీఐ సైదనాయక్, రేగోడ్ ఏఎస్‌ఐ నారాయణలు మృతదేహాలను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. మృతుడు కిష్టయ్య తండ్రి భూమయ్య ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ నారాయణ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement