చోరుల ముఠా ఆటకట్టు | thieves gang arrested | Sakshi
Sakshi News home page

చోరుల ముఠా ఆటకట్టు

Aug 1 2016 10:27 PM | Updated on Sep 4 2017 7:22 AM

చోరుల ముఠా ఆటకట్టు

చోరుల ముఠా ఆటకట్టు

సంతల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా ఆట కట్టించారు పోలీసులు. నిందితులను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

  • ఐదుగురి అరెస్టు, రిమాండ్‌
  • ఐదు తులాల బంగారం, 80 తులాల వెండి స్వాధీనం
  • బోధన్‌ : సంతల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా ఆట కట్టించారు పోలీసులు. నిందితులను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. రెంజల్‌ మండలంలోని వీర్నగుట్టకు చెందిన ఓర్పు సాహెబ్‌రావు (32) ఓర్పు శశిరేఖ (25), సంపంగి నాగమణి (30) పల్లపు నర్సమ్మ (35),ఎత్తారి లింగమ్మ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో జరిగే వారంతపు సంతలను టార్గెట్‌గా చేసుకొనేవారు. సంతకు ఒంటరిగా వచ్చే అమాయక మహిళలతో పరిచయం పెంచుకునే వారు. మాయమాటలతో తమ దారిలోకి తెచ్చుకుని కల్లు బట్టీలకు తీసుకెళ్లి, నిద్రమాత్రలు కలిపిన కళ్లు తాగించే వారు. బాధితురాలు మత్తులోకి జారుకోగానే, ఆమెపై ఉన్న ఆభరణాలతో ఉడాయించే వారు. ఇలా కోటగిరిలో రెండు, ఎడపల్లి, వరిన, పిట్లంలలో చోరీలకు పాల్పడ్డారు. కోటగిరి ఠాణాలో నమోదైన ఓ కేసు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం పోతంగల్‌ వారంతపు సంతలో ముఠా సభ్యులు సాహెబ్‌రావు, శశిరేఖ సంచరిస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మిగతా నిందితుల వివరాలు, చేసిన నేరాలు వెల్లడించారు. దీంతో వారందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఐదు తులాల బంగారం, 80 తులాల వెండి, రెండు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ తరహా చోరీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాసులు, కోటగిరి, రెంజల్‌ ఎస్సైలు బషీర్‌ అహ్మద్, రవికుమార్, ఐడీ విభాగం సిబ్బంది అనిల్, బాబురావులను డీఎస్పీ అభినందించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement