పావులో సగం | Telangana govt to sanction half of third phase loan waiver | Sakshi
Sakshi News home page

పావులో సగం

Jun 27 2016 11:14 AM | Updated on Oct 1 2018 2:44 PM

పావులో సగం - Sakshi

పావులో సగం

కర్షకులపై సర్కారు కరుణించింది.. కానీ అది పావులో సగమే . మూడో విడత రుణమాఫీ కింద రూ. 570 కోట్లకు పైగా జిల్లాకు రావాల్సి ఉండగా, అందులో సగం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- మూడో విడత రుణమాఫీలో సగం నిధులిచ్చిన సర్కారు
- మరో నెల రోజుల్లో మిగతా సగం..
- తెలంగాణ ప్రభుత్వంలో రుణమాఫీ కింద వచ్చింది
- ఇప్పటివరకు రూ.1,500 కోట్ల పైమాటే
- ఇంకా రావాల్సింది రూ. వెయ్యి కోట్లు
 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కర్షకులపై సర్కారు కరుణించింది.. కానీ అది పావులో సగమే . మూడో విడత రుణమాఫీ కింద రూ. 570 కోట్లకు పైగా జిల్లాకు రావాల్సి ఉండగా, అందులో సగం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత రుణమాఫీ కింద రూ. 4,380 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.2,190 కోట్లు ఇస్తూ జీఓ జారీ చేసింది. అంటే.. మూడో విడత ఇవ్వాల్సిన దాంట్లో సగమే మం జూరు చేయడంతో జిల్లాకు రావాల్సి న రూ.570 కోట్లలో సగం... అంటే రూ. 285 కోట్లకు పైగా నిధులు బ్యాంకుల్లో జమ కానున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో పావులో సగం నిధులిచ్చిన ప్రభుత్వం మరో పావుశాతం నిధులను ఇచ్చేందుకు నెలరోజులు పడుతుందని చెబుతోంది.
 
 ఇప్పటివరకు రూ.1500 కోట్ల పైమాటే
 జిల్లాలో రుణమాఫీ కింద దాదాపు 5లక్షల మంది రైతాంగానికి రూ. 2500 కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ, 2014 సెప్టెంబర్ 3న మొదటి విడత రుణమాఫీ, 2015 జూన్ 20న, 2015 జూలై 31న రెండు దఫాల్లో రెండో విడత రుణమాఫీ కింద నిధులను విడుదల చేసింది. ఇక, ఆ తర్వాత మళ్లీ 2016 జూన్ 25న మూడో విడతలో సగం విడుదల చేసింది. రెండు విడతలకు గాను రూ.1250 కోట్లు, మూడో విడతలో సగం మరో రూ.270 కోట్ల వరకు కలిపి రూ.1500 కోట్ల వరకు ఇప్పటివరకు రుణమాఫీ కింద నిధులు మంజూరయ్యాయి. మరో రూ.1000 కోట్ల బకాయిలు అంతే ఉన్నాయి.
 
 దేవుడు కరుణించాడు కానీ..
 ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో అన్నదాతలకు పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్న ఆలోచనతో మూడో విడత రుణమాఫీలో సగం నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నా... తాజాగా విడుదల చేసిన నిధులు రైతాంగానికి ఏ మాత్రం ఉపయోగపడతాయనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే.. రుణమాఫీ సాకు చూపి గత మూడు సీజన్‌లుగా రైతులకు బ్యాంకర్లు రుణాలివ్వడం కోసం అనేక కొర్రీలు పెడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు జిల్లాలోని రైతులకు రూపాయి కూడా రుణాలివ్వలేదు. అసలు కౌలురైతుల పరిస్థితి అయితే ఆగమ్యగోచరం.
 
 ఈ పరిస్థితుల్లో పావులో సగమైనా సర్కారు కరుణ చూపిందిలే అని తృప్తి పడాలా.... సరిపడా కరుణ ఎప్పుడు చూపుతారోనని మధనపడాలో జిల్లా రైతాంగానికి అంతుపట్టడం లేదు. మరి,  ప్రభుత్వం ఇచ్చిన ఈ పావు సగం నిధులతో బ్యాంకర్లు సరిపెట్టుకుంటారా...? మిగిలిన సగం రావాలని, నాలుగో విడత నిధులు కూడా రావాల్సిందేనని మెలిక పెట్టి ఎప్పటిలాగే రైతన్నను బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారా..? అన్నది అన్నదాత అదృష్టంపై ఆధారపడి ఉన్నట్టే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement