మృతదేహంతో రోడ్డుపై ధర్నా
పట్టణంలోని అమ్మ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత ఏర్పడింది.
• డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందంటూ ఆందోళన
•మడకశిరలోని అమ్మ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత
మడకశిర: పట్టణంలోని అమ్మ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత ఏర్పడింది. బాలింత మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు,కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట అమరాపురం ప్ర«ధానరోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. వివరాలు.. గుడిబండ మండలంలోని జంబులబండ గొల్లహట్టికి చెందిన సుశీలమ్మ(26)అనే గర్భిణికి ఈనెల 3న అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను మడకశిరలోని అమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. ఆడబిడ్డకు జన్మ నిచ్చింది.
రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంది. ఈక్రమంలో బాలింత కడుపు ఎక్కువగా వాపు వచ్చింది.పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె మరణించింది. మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహంతో మృతదేహాన్ని బెంగళూరు నుంచి మడకశిరకు తరలించారు.అమ్మ ఆస్పత్రి వద్దకు చేరుకుని ప్రధాన రోడ్డుపై మృత దేహాన్ని ఉంచి ధర్నా చేశారు. దీంతో రాక పోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్నాను కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయం జరిగే వరకు మృత దేహాన్ని తీసుకెళ్లమని భీష్మించుకు కూర్చొన్నారు. చివరకు ప్రజాప్రతినిధులు, పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


