‘పోలవరం’ వైఎస్‌ పుణ్యమే | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ వైఎస్‌ పుణ్యమే

Published Thu, Jan 12 2017 11:30 PM

polavaram credit ysr

  • తమ ఘనతగా ‘బాబు’ సర్కారు ప్రచారం l
  • ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
  • నెల్లిపాక : 
    పోలవరం ప్రాజెక్ట్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే అని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. బుధవారం రాత్రి ఆమె ఎటపాకలో విలేకరులతో  మాట్లాడుతూ వైఎస్‌ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పేరుతో వేలాది కోట్ల నిధులు కాజేస్తూ ప్రాజెక్టు తమ కృషే అని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నిర్వాసితులను నిలువునా మోసం చేసేందుకు పూనుకుందన్నారు. సీఎం కాంట్రాక్టర్లపై చూపుతున్న శ్రద్ధ ముంపు మండలాలపై చూపటం లేదని ఆరోపించారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షనేత పోరాడుతుంటే పోలవరాన్ని అడ్డుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా, ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు అబద్ధాలు చెపుతూ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విలీన మండలాల ప్రజలకు అబద్ధాలు  చెపుతున్న టీడీపీ నాయకులు ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో  వివరించాలన్నారు. గత మూడు జన్మభూముల్లో వచ్చిన దరఖాస్తులకు నేటికీ పరిష్కారం చూపకుండా ప్రజలను మోసం చేసి ఇప్పడు జన్మభూమి అంటూ గొప్పలు చెపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తున్న టీడీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఎండీ మూసా, రాయిని రమేష్, చండ్ర కృష్ణార్జునరావు, కడియం రామాచారి, రామలింగారెడ్డి, సర్పంచ్‌ గుండి లక్ష్మి తదితరులు ఆమె వెంట ఉన్నారు.
     

Advertisement
Advertisement