నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
వైభవంగా నృసింహుడి ధ్వజారోహణం
Mar 4 2017 11:58 PM | Updated on Sep 29 2018 6:06 PM
మంగళగిరి: నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం ఉత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతలను వాయు వేగంతో వెళ్లి ఆహ్వానించేందుకు భక్తాగ్రేశ్వరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించడం ఉత్సవ ప్రత్యేకత. రాత్రి పొద్దుపోయాక భక్తజన కోటి సమక్షంలో ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో మరో ప్రత్యేకత ఉంది. అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దగా పిలుస్తారు.
సంతానం లేని వారు ధ్వజారోహణ ఉత్సవంలో గరుడ ముద్దను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం. గరుడముద్ద ప్రసాదం కోసం మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవం అనంతరం ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టంపచేసి పురవీధులలో విహరింపచేశారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోషియన్ వారు వ్యవహరించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలె వెంకటసాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, రావుల శ్రీనివాసరావు, మోరంపూడి నాగేశ్వరరావు, ఆలేటి నాగలక్ష్మి, వెనిగళ్ళ ఉమాకాంతం, పంచుమరి ప్రసాద్, దీవి అనంతపద్మాచార్యులు పూజలు నిర్వహించగా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి మండెపూడి పానకాలరావు పర్యేక్షించారు.
Advertisement


