మల్లన్నసాగర్‌తో కామారెడ్డికి అన్యాయమే | Mallannasagar | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్‌తో కామారెడ్డికి అన్యాయమే

Jul 31 2016 11:34 PM | Updated on Sep 18 2019 2:55 PM

మల్లన్నసాగర్‌తో కామారెడ్డికి అన్యాయమే - Sakshi

మల్లన్నసాగర్‌తో కామారెడ్డికి అన్యాయమే

ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో ప్రభుత్వం కామారెడ్డి ప్రాంతానికి అన్యాయం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. మల్లన్నసాగర్‌ నుంచి కామారెడ్డికి నీళ్లివ్వడం సాధ్యం కాదని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్‌ చేశారు

కామారెడ్డి : ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో ప్రభుత్వం కామారెడ్డి ప్రాంతానికి అన్యాయం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. మల్లన్నసాగర్‌ నుంచి కామారెడ్డికి నీళ్లివ్వడం సాధ్యం కాదని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా కామారెడ్డి ప్రాంతానికి నీటినందించేందుకు పనులు ప్రారంభించారన్నారు. 22వ ప్యాకేజీ ద్వారా కామారెడ్డి పనులు చేపడితే సాగునీటి కష్టాలు తీరుతాయనుకుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీ డిజైన్‌ పేరుతో పనులను వదిలేసిందన్నారు. మల్లన్నసాగర్‌ విషయంలో ఈ ప్రాంత రైతులను మభ్యపెట్టడం సరికాదన్నారు. మల్లన్నసాగర్‌ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు నీరివ్వడం సాధ్యం కాదని నిపుణులు ఇచ్చిన రిపోర్టులు తన వద్ద ఉన్నాయని.. దీనిపై మంత్రి హరీశ్‌రావు, విప్‌ గోవర్ధన్‌ స్పష్టం చేయాలన్నారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడుతున్నట్టు టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది తమ హయాంలోనేనని స్పష్టం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ, సీడీసీ చైర్మన్‌ అశోక్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శి అశోక్, నేతలు అంజయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, రాంకుమార్, మోహన్, గోనె శ్రీను, బాబా,తదితరులున్నారు.
రెండో ఏఎన్‌ఎంల సమ్మెకు సంఘీభావం..
రెండో ఏఎన్‌ఎంల సమ్మెకు షబ్బీర్‌అలీ మద్దతు ప్రకటించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరానికి వెళ్లి ఆయన సంఘీభావం తెలిపారు. 14 రోజులుగా ఏఎన్‌ఎంలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement