పెళ్లికి ముందే వరకట్న దాహానికి బలి.. | Lecturer commits suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందే వరకట్న దాహానికి బలి..

Apr 2 2016 3:09 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లి కాకుండానే వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించడంతో లెక్చరర్‌గా పనిచేస్తున్న మమత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

వరంగల్ : పెళ్లి కాకుండానే వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించడంతో  లెక్చరర్‌గా పనిచేస్తున్న మమత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎలుగుబల్లికి చెందిన వెంకటరమణ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన మమత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

తిరుపతిలో పీజీ చేస్తున్నప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. మమత పీజీ పూర్తయ్యాక వరంగల్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తుండగా వెంకటరమణ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. పెద్దల అంగీకారంతో గత ఏడాది నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచీ మమతకు కష్టాలు మొదలయ్యాయి. అదనంగా కట్నం ఇవ్వకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానని వెంకటరమణ వేధించేవాడు.

ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో మమత లోలోపల కుమిలిపోయేది. మారతాడేమోనని ఏడాది కాలంగా ఎదురు చూసింది. అయినా వైద్యుడైన వెంకటరమణలో ఏ మార్పు రాకపోవడంతో మనస్థాపానికి గురైంది. మానసిక సంఘర్షణను తట్టుకోలేక పురుగుల మందు తాగింది. వరంగల్ ఎజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మమత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement