కస్తుర్బా విద్యార్థులకు అస్వస్థత | kasturiba students are sick | Sakshi
Sakshi News home page

కస్తుర్బా విద్యార్థులకు అస్వస్థత

Aug 4 2016 12:59 AM | Updated on Sep 4 2017 7:40 AM

స్థానిక మల్లెవేముల రస్తాలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో బుధవారం కలుషిత నీటిని తాగి 30 మంది విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు.

– అతిసారం బారిన 30 మంది విద్యార్థినిలు
– ఏడాదిగా శుభ్రం చేయ్యని నీటి ట్యాంక్‌ 
 
చాగలమర్రి:
స్థానిక మల్లెవేముల రస్తాలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో బుధవారం కలుషిత నీటిని తాగి 30 మంది విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలకు చెందిన కళ్యాణిబాయి, స్రవంతి, పావని, భారతి, కళావతి, వరలక్ష్మి, అశ్విని, స్వాతి, శిరీష, సురేఖ, అనూష, చంద్రిక, మల్లేశ్వరమ్మ తోపాటు 17 మంది వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ఎస్‌ఓ భావాని అందుబాటులో లేక పోవడంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను ఆటోల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారి గంగాధర్‌ విద్యార్థులను పరీక్షించి సెలైన్‌ బాటిళ్లను ఎక్కించారు. విషయం తెలుసుకొన్న ఎంపీడీఓ శ్రీలత అక్కడికి చేరుకొని పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థినిల వద్ద ఉండాలని ఆసుపత్రికి పంపించారు. విద్యార్థినిల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు చేరుకున్నారు. పాఠశాల ఆవరణలో మురికినీరు నిల్వ ఉండడంతో  మూడు రోజులుగా విద్యార్థినిలకు జ్వరాలు వచ్చి మంచం పట్టారు. తాగు నీరు సరఫరా చేసే నీటిట్యాంక్‌ ఏడాదిగా శుభ్రం చేయలేదని తెలుస్తోంది. డిప్యూటీ తహసీల్దార్‌ జయంతి, ఆర్‌ఐ కేశాల్‌రెడ్డి, ఈఓఆర్‌డి సుబ్బారెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు కస్తూర్బా గురుకుల పాఠశాలకు చేరుకొని నీటి నమూనాలను సేకరించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement