కీర్తి ప్రతిష్టలు పెంచాలి
జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్ కోరారు. వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూకే ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది దేశంలో ఉన్న వర్సిటీల్లో పేరొందిందన్నారు.
జేఎన్టీయూకే 8వ ఆవిర్భావ వేడుకల్లో వీసీ కుమార్ పిలుపు
బాలాజీచెరువు (కాకినాడ) :
జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్ కోరారు. వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూకే ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది దేశంలో ఉన్న వర్సిటీల్లో పేరొందిందన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. త్వరలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతూ 75 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను జేఎన్టీయూకే నుంచి 15 మందిని, అనుబంధ కళాశాలల నుంచి 10 మందిని ఎంపిక చేసి విదేశీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పీహెచ్డీ కోర్సులు చేసే అవకాశం రాష్ట్రప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇప్పటికే కేంద్రమానవ వనరుల శాఖ రూ.పదికోట్లు డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్కు మంజూరు చేసిందని, బయోటెక్నాలజీ విభాగంలో డాక్టర్ మాలోతు రమేష్ పరిశోధనలు గావించి మూడు పెటేంట్ హక్కులు సాధించి వర్సిటీ ప్రతిష్ట పెంచారన్నారు. రెక్టార్ ప్రభాకరరావు మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, ఇంక్యూబేషన్ సెంటర్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్పై దృష్టి పెట్టి వాటిని విద్యార్థులకు చేరవేయాలన్నారు. రిజిస్ట్రార్ సాయిబాబు మాట్లాడుతూ యూనివర్సీటీ పరీక్షల విభాగంలో సంస్కరణలు అమలు చేశామని, జంబ్లింగ్ విధానంతో పాటు సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నామన్నారు. జేఎన్టీయూకే మూడుసార్లు ఈసెట్, రెండుసార్లు ఎంసెట్, పీజీ ఈ సెట్ పొరపాట్లకు తావులేకుండా నిర్వహించిందన్నారు. అనంతరం కృష్ణాపుష్కరాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్రావు, ప్రోగ్రాం డైరెక్టర్లు పాల్గొన్నారు.