భారీగా పెరిగిన రసాయన ఎరువుల వినియోగం | huge usage of chemical fartilizer | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన రసాయన ఎరువుల వినియోగం

Jul 19 2016 11:17 PM | Updated on Sep 4 2017 5:19 AM

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10శాతం వరకు పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

– ఇప్పటికే 1,22,615 టన్నుల వాడకం
– ఎరువుల ఖర్చు రూ.110 కోట్లపైనే
– 34 శాతం భూముల్లోనే పంటలు సాగు
– ఇంకా సాగుకు నోచుకోని వరి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10శాతం వరకు పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,22, 615 టన్నుల ఎరువుల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఒక్క ఎరువులపైనే రైతులు రూ.110.35 కోట్లు వ్యయం చేసినట్లు లెక్క. ఖరీఫ్‌ సీజన్‌కు 3,32,054 టన్నుల ఎరువులు అవసర మవుతాయి. అయితే గత ఏప్రిల్‌ 1 నాటికి జిల్లాలో 1,46,279.24 టన్నులు నిల్వ ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,03,395.4 టన్నుల వచ్చాయి. మొత్తంగా 2,49,674.64 టన్నుల ఎరువులుండగా 1,22, 615 టన్నులు అమ్మకం జరిగింది. ఇందులో అత్యధికంగా కాంప్లెక్స్‌ ఎరువులు 58,509.75 టన్నులు వినియోగించారు. యూరియా 54,233.05 టన్నులు, డీఏపీ 7,175.08 టన్నులు, ఎంఓపీ 5,977.3 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,164.46 టన్నుల ప్రకారం వినియోగించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంటే కేవలం 34శాతం భూముల్లో సాగైన పంటలకే ఇంత భారీగా ఎరువులు వినియోగించడం గమనార్హం. పూర్తిస్థాయిలో పంటలు సాగైతే ఎరువుల వినియోగం ఎంతమేరకు చేరుతుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
ప్రకతి వ్యవసాయంపై ఆసక్తి కరువు..
రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోయిన రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రకతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది. అయితే ఖరీఫ్‌ సీజన్‌లో రెండు నెలలు దాటకుండానే ఇంతలా రసాయన ఎరువుల వినియోగం నమోదుకావడాన్ని బట్టి ప్రకతివ్యవసాయ విధానాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement