ఎల్లంపల్లికి భారీగా చేరుతున్న వరద నీరు | FULL WATER IN ELLAMPALLI PROJECT | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లికి భారీగా చేరుతున్న వరద నీరు

Jul 24 2016 11:23 PM | Updated on Sep 4 2017 6:04 AM

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతోంది.

  • 144.56 మీటర్లకు చేరిన నీరు
  • మంచిర్యాల రూరల్‌ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతోంది. ఆదివారం మండలంలోని గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్‌) ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతుండటంతో నిండు కుండలా దర్శనమిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు కడెం ప్రాజెక్ట్‌ ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో ఎల్లంపల్లి నిండుకుంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్‌ లెవెల్‌ కాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు 144.56  మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీల నీటి సామర్థ్యానికి  గాను ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.777 టీఎంసీల నీటీ నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ ఫ్లో 8 వేల 696 కూసెక్కులు కాగా ఇందులో 521 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉంది.
    అవుట్‌ ఫ్లో నీరు ఎన్టీపీసీకి 363 క్యూసెక్కులు, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌కు 158 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జేసీ సుందర్‌ అబ్నార్‌ రెవెన్యూ అధికారులతో కలిసి ఇప్పటికే నిర్వాసితులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు లేదని ప్రాజెక్ట్‌కు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు.
    ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అయితే ముందస్తుగా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక పునరావాస ఏర్పాట్లు కూడా సిద్దం చేసి ఉంచామన్నారు.
    ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవెల్స్‌ ప్రకారం నీట మునిగే గ్రామాలు...
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రకారం మంచిర్యాల, లక్సెట్టిపేట మండలాల పరిధిలోని ముంపు గ్రామాలు ఈ విధంగా మునగనున్నాయి. ప్రాజెక్ట్‌ 148 మీటర్ల క్రస్ట్‌ లెవెల్‌ కాగా ఇప్పటి వరకు 144.56 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. అయితే ఈ నీరు మరింత పెరిగితే ఆయా గ్రామాల వారిగా ముంపు గ్రామాలు నీట మునగనున్నాయి. 143.50 మీటర్ల నీటి నిల్వ ఉంటే నమ్నూర్, 145.00లో రాపల్లి, 145.50లో కొండపల్లి, లక్సెట్టిపేటలోని సురారం, 147.50లో చందనాపూర్, 147.75లో కర్ణమామిడి, 148.00లో గుడిపేట,149.50లో పడ్తనపల్లి, లక్సెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామాలు నీట మునగనున్నాయి.
     

Advertisement
 
Advertisement
Advertisement