ప్రజా పంపిణీలో వందశాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలని ఎల్డీఎం నరసింహారావు సూచించారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
Feb 10 2017 11:34 PM | Updated on Sep 5 2017 3:23 AM
- డీలర్ల అవగాహన సదస్సులో ఎల్డీఎం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో వందశాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలని ఎల్డీఎం నరసింహారావు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై చౌకధరల దుకాణాల డీలర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పినో కంపెనీ, ఐజీఎస్ ఇంటిగ్రాస్ కంపెనీలు ప్రజాపంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు సాంకేతిక సహకారం ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు ఎల్డీఎం తెలిపారు. నగదు ప్రమేయం లేని లావాదేవీలు వంద శాతం అమలు కావాలంటే కార్డుదారుల బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబరుతో అనుసంధానించాలన్నారు.
బ్యాంక్ సర్వర్ను ఎన్ఐసీ సర్వర్తో లింకప్ చేయడం ద్వారా ఈ-పాస్ మిషన్ ద్వారానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. కార్డుదారులు ఈ-పాస్ మిషన్లో వేలిముద్ర వేస్తే బ్యాంకు ఖాతా వివరాలు వస్తాయని తెలిపారు. సరుకులు, వాటి ధరలను బట్టి వెంటనే బిల్లు జనరేట్ అవుతుందని, దాని ప్రకారం అమౌంటు కార్డుదారుని ఖాతా నుంచి డీలరు ఖాతాకు జమ అవుతుందని వివరించారు. జిల్లాలో 1556 మంది డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించినట్లు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ ఎఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, పినో కంపెనీ ప్రతినిధి చంద్రమోహన్ నాయుడు, ఐజీఎస్, ఇంటిగ్రాస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement


