రోగి శవం తగులబెట్టిన వైద్యుడు | Dried boasts the doctor of the patient's body | Sakshi
Sakshi News home page

రోగి శవం తగులబెట్టిన వైద్యుడు

Nov 23 2015 6:29 PM | Updated on Aug 21 2018 5:52 PM

రోగి శవం తగులబెట్టిన వైద్యుడు - Sakshi

రోగి శవం తగులబెట్టిన వైద్యుడు

చికిత్సకు వచ్చిన రోగికి మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన ఓ యునానీ వైద్యుడు అతడి చావుకు కారణమయ్యాడు.

వెంబడించి పట్టుకున్న పోలీసులు
పెయిన్‌కిల్లర్ వికటించడంతో రోగి మృతి


 హైదరాబాద్: చికిత్సకు వచ్చిన రోగికి మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన ఓ యునానీ వైద్యుడు అతడి చావుకు కారణమయ్యాడు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రోగి శవాన్ని తగులబెడుతూ పోలీసుల కంట పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివి... నగరంలోని మిస్రీగంజ్‌కి చెందిన యునానీ వైద్యుడు సల్మాన్ అలియాస్ సాజిద్(35) మదీనాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఫలక్‌నుమా నవాబ్‌షాకుంట నివాసితుడు, పాన్ షాప్ నిర్వాహకుడు నయీముద్దీన్ ఖాజా(45) నడుము నొప్పికి సాజిద్ వద్ద వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు.

ఇదే క్రమంలో శనివారం రాత్రి సల్మాన్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ డోస్ ఎక్కువ కావడంతో ఖాజా మృతిచెందాడు. దీంతో భయభ్రాంతులకు గురైన వైద్యుడు... ఖాజా శవాన్ని మూటలో కట్టి, రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై నిర్మానుష్యంగా ఉండే సాతంరాయి గ్రామం కోదండ రామాలయం సమీపంలోకి తీసుకెళ్లాడు. శవంపై కాగితాలు, కట్టెలు వేసి తగులబెట్టాడు. అదే సమయంలో అటువైపు వచ్చిన బ్లూ కోల్ట్ పోలీసులను చూసిన సల్మాన్ పరుగులు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. బైక్ స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement