విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకానికి నిధుల కొరత ఏర్పడింది.
అదనంగా రూ. 48 కోట్ల కోసం సర్కారుకు పశుసంవర్ధకశాఖ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకానికి నిధుల కొరత ఏర్పడింది. ఏడాదిగా ఇస్తున్న ఈ ప్రోత్సాహకానికి నిధుల కటకటతో రైతులకు విజయ డెయిరీ బకాయి పడింది. దీంతో రైతులకు ప్రోత్సాహకానికి మరో రూ. 48 కోట్లు మంజూరు చేయాలని పశు సంవర్ధకశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకంగా ఒక్కో లీటరుకు ప్రభుత్వం రూ. 4 చెల్లిస్తోంది. దీంతో ఒకవైపు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం.. మరోవైపు కొన్ని ప్రైవేటు డెయిరీలకు కూడా ప్రోత్సాహకం అక్రమంగా వెళ్తుండటంతో ప్రభుత్వం కేటాయించిన రూ. 12 కోట్ల బడ్జెట్ సరిపోవడంలేదు.
ఇప్పటికే ఆ బడ్జెట్ నిధులన్నీ అయిపోగా... విజయ డెయిరీ తన వద్ద నిల్వ ఉన్న నిధుల నుంచి కూడా అదనంగా రూ. 12 కోట్ల మేరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా రైతులకు బకాయి ఉన్నట్లు తెలిసింది. రూ. 50 కోట్లు కావాలని విజయ డెయిరీ ప్రతిపాదించగా ప్రభుత్వం రూ. 12 కోట్లే కేటాయించింది.