-
కామారెడ్డి జిల్లా కోసం కార్యాలయాలు ఖరారు
-
బాన్సువాడ డివిజన్.. 9 మండలాలకు కార్యాలయాలు
-
‘పునర్విభజన’పై వినతులు, అభ్యంతరాల వెల్లువ
-
కార్యాలయాల ఏర్పాటు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
-
దసరా నుంచి మండలాలు, కొత్త జిల్లాల్లో పాలన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముసాయిదా విడుదలే తరువాయి.. కొత్త జిల్లాల్లో వడివడిగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఓ వైపు ప్రజల నుంచి వినతులు, అభ్యంతరాలు స్వీకరిస్తున్న అధికారులు, మరోవైపు దసరా నుంచి పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఇటు నిజామాబాద్లో, అటు కామారెడ్డిలో కార్యాలయాలు ఖరారు చేసిన అధికారులు.. అధికారులు, ఉద్యోగుల విభజన కూడా చేశారు. అయితే ఆ ఫైలు ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శుల పరిశీలనలో ఉన్నందున.. అధికారులు ఆ వివరాలను అత్యంతగోప్యంగా ఉంచుతున్నారు. అయితే కొత్తగా ఏర్పడే కామారెడ్డిలో జిల్లా కార్యాలయాలపై ఇప్పటికే స్పష్టత రాగా, కొత్తగా ఏర్పడే బాన్సువాడ రెవెన్యూ డివిజన్తోపాటు 9 మండలాల్లో కార్యాలయాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ముసాయిదా అనంతరం పరిణామాలపై చీఫ్ సెక్రటరీ రాజీవ్శర్మ బుధవారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
45 మండలాలతో రెండు జిల్లాలు.. రెండో, మూడో పెరిగే అవకాశం..
సమీక్షలు, సమావేశాలు, కీలక భేటీల అనంతరం ప్రభుత్వం 45 మండలాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటకు ముసాయిదా విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాలో 26, కామారెడ్డి జిల్లాలో 19 మండలాలు ఉంటాయి. ఇదివరకున్న 36 మండలాలకు తోడు అదనంగా తొమ్మిది మండలాలను ఏర్పాటు చేస్తుండగా.. పలుచోట్ల నుంచి ఇంకా మండలాల డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు, వినతుల స్వీకరణల అనంతరం రెండో, మూడో మండలాలు పెరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ముసాయిదా విడుదల తర్వాత రెండు రోజుల్లో మొత్తం 47 వినతులు, అభ్యంతరాలు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇందులో 44 ఆన్లైన్లో, మరో మూడు రాతపూర్వకంగా అందాయి. ఇందులో ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూరు మండలంకు తోడు ఆర్మూరు రూరల్ మండలం, దోమకొండ మండలం బీబీపేట, నందిపేట మండలంలో డొంకేశ్వర్, వర్ని మండలంలో చందూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చే యాలన్న వినతులు కూడా ఉన్నాయి. అలాగే తమ గ్రామాలను పాత మండలాలు, రెవెన్యూ డివిజన్లలోనే కొనసాగించాలని, కొత్త మండలాల్లో చేర్చవద్దని కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే వీటన్నింటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల్లో అత్యధికంగా కొత్త మండలాల ఏర్పాటు, పాత జిల్లా నుంచి వీడదీయరాదంటూ పేర్కొన్నారు. ఇదిలా వుంటే దసరా నుంచే కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాల్లో పరిపాలన కొనసాగనుండగా.. అధికారులు మరింత వేగం పెంచారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం
ప్రజాప్రతినిధులు, అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న నిజామాబాద్లో కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై జరుగుతున్న కసరత్తు, మార్పులు, చేర్పులకు సంబంధించిన ముసాయిదా విడుదలతో సస్పెన్స్కు తెరపడింది. ఏయే మండలాలు ఏ జిల్లాలో ఉంటాయి? కొత్తగా ఎన్ని మండలాలు, ఏ జిల్లాలో ఏర్పడతాయి ? అన్న సందేహాలకు ముసాయిదా తెరదించింది. 26 మండలాలతో నిజామాబాద్, 19 మండలాలతో కామారెడ్డి జిల్లాల ఏర్పాటు ఖాయం కావడంతో.. దసరా నుంచే మొదలయ్యే పాలనపైనే అందరు దృష్టి సారించారు. కామారెడ్డిలో తాత్కాలిక కార్యాలయాల కోసం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని మైనార్టీ గురుకుల భవనం గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న 19 గదులు, మొదటి అంతస్థులో ఉన్న 18 గదులతోపాటు, ఆ భవనం పక్కన ఉన్న రెండు డార్మెటరీలను కార్యాలయాల వసతి కోసం ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలన్న ప్రతిపాదనలే ఖాయమైనట్లు చెప్తున్నారు. ఈ ప్రకారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలతోపాటు సంక్షేమ, కార్పొరేషన్లకు గ్రౌండ్ఫ్లోర్లో వసతి కల్పించనున్నారు. అదే విధంగా yీ ఆర్డీఏ, మెప్మా, డీఈవో, ఆర్వీఎం, డీవీఈవో, ఆర్ఐవో కార్యాలయాలను కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇవ్వనున్నారు. మొదటి అంతస్థులో ఆర్అండ్బీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల, ఇంజినీరింగ్ విభాగాలు, జిల్లా పరిషత్, డీపీవో, గనులు, భూగర్భజలాలు, కాలుష్య నివారణ, పరిశ్రమల శాఖలకు కేటాయించనున్నారు. అలాగే వ్యవసాయ, పట్టు పరిశ్రమ, హార్టీకల్చర్, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, మార్కెట్ విభాగాలను మార్కెట్యార్డు నందు ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో ఉండే దాదాపు 80 ప్రభుత్వశాఖలకు కొత్తగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో తాత్కాలిక వసతులు కల్పించే పనిలో ఉన్నారు. అలాగే బాన్సువాడ రెవెన్యూ డివిజన్, 9 మండలాలకు కార్యాలయాల ఏర్పాటు జరుగుతోంది.