హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ ఐఏఎస్‌ తీరు మారలేదు.. | An IAS officer repeatedly slapped a student during an exam in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ ఐఏఎస్‌ తీరు మారలేదు..

Jul 13 2025 7:57 PM | Updated on Jul 13 2025 9:15 PM

An IAS officer repeatedly slapped a student during an exam in Madhya Pradesh

భోపాల్‌: పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినిపై కలెక్టర్‌ పలు మార్లు దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా ఘటనతో మరోసారి సదరు వివాదాస్పద ఐఏఎస్‌ అధికారి తీరు చర్చాంశనీయంగా  మారింది.

విద్యార్థిపై కలెక్టర్‌ చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భింద్ జిల్లాలోని మధ్యప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు హేమంత్‌ కటారే మామ నారాయణ్‌ దంగ్రౌలియాకు చెందిన దీన్‌ దయాళ్‌ దంగ్రౌలియా మహవిద్యాలయ కాలేజీలో మాథ్స్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష రాసే సమయంలో ఓ విద్యార్థి బాత్‌రూంకు వెళ్లి తిరిగి తన స్థానంలో కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అప్పుడే పరీక్ష కేంద్రంలోకి జిల్లా కలెక్టర్‌ సంజీవ్ శ్రీవాస్తవ విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తున్నారని పరిశీలించే ప్రయత్నం చేశారు.

బాత్‌రూంకు వెళ్లి వచ్చిన విద్యార్థిపై పలు ప్రశ్నలు సంధించాడు. విద్యార్థి సైతం కలెక్టర్‌కు రిప్లయి ఇచ్చాడు. అప్పుడే విద్యార్థి సమాధానంతో కలెక్టర్‌ కోపోద్రికులయ్యారు. విద్యార్థిపై పలుమార్లు దాడి చేశారు. అనంతరం విద్యార్థి సిబ్బంది గదిలోకి  పిలిపించుకున్నారు. మరో మారు విద్యార్ధిపై చేయి చేసుకున్నారు. ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

కలెక్టర్‌ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్ధిపేరు రోహిత్‌ రాథోడ్‌. బీఎస్‌ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షా కేంద్రంలో రోహిత్‌ రాథోర్‌ తన ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకెళ్లి వాటికి సమాధానాలు తెలుసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.

దీనిపై కలెక్టర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవ స్పందించారు. విద్యార్ధిపై చేయిచేసుకోవడాన్ని తనని తాను సమర్ధించుకున్నారు. ‘ఈ పరీక్షా కేంద్రంలో ఆర్గనైజ్డ్‌ మాస్‌ చీటింగ్‌ జరుగుతుందనే సమాచారం అందింది. మాస్‌ చీటింగ్‌ గుట్టురట్టు చేసేందుకే ఎగ్జామ్‌ సెంటర్‌ను విజిట్‌ చేశాను. ఆ సమయంలో ఓ విద్యార్థి తన ప్రశ్నాపత్రాన్ని టాయిలెట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని పరీక్ష జరుగుతున్న తన బెంచ్‌ మీద కూర్చొనే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో  బెంచ్‌ మీద క్వశ్చన్‌ పేపర్‌ లేదు. ఇదే విషయాన్ని విద్యార్ధిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. కాలేజీలో చీటింగ్‌లు జరుగుతున్నాయనే సమాచారం వచ్చింది. భవిష్యత్తులో కాలేజీల్లో ఇలా జరగకుండా యూనివర్సీటీకి లేఖ రాస్తానని అన్నారు.

విద్యార్థి రోహిత్‌ రాథోర్‌ మాట్లాడుతూ.. నేను టాయిలెట్‌కు వెళ్లి వచ్చేసరికి నా ప్రశ్నపత్రం కనిపించలేదు. నేను మోసం చేయలేదని వాపోయాడు. కాగా, విద్యార్ధిపై దాడి విషయంలో ఐఏఎస్‌ అధికారి సంజీవ్ శ్రీవాస్తవపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌ హైకోర్టు సైతం  ఆయన ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసింది. మరో అధికారిణి మాలా శర్మ ఆయనపై మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు విద్యార్థిపై ఐఏఎస్‌ అధికారి సంజీవ్ శ్రీవాస్తవ చేయిచేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement