యువకుడిపై కత్తితో దాడి

Young Women Knife Attack on Man in Anantapur - Sakshi

ఆత్మరక్షణ కోసమే అంటున్న యువతి

తనకల్లు: యువకుడిపై యువతి కత్తితో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు యువతి చెబుతోంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం తనకల్లులోని ఇందిరానగర్‌కు చెందిన స్వప్న అనే యువతి సోమవారం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఒంటరిగా కూర్చుంది. అదే సమయంలో ఆలయ పూజారి బంధువు మంజునాథ్‌ లైట్లు వేసేందుకని స్విచ్‌బోర్డు దగ్గరకు వెళ్లబోయాడు. అతను దురుద్దేశంతో తనవద్దకే వస్తున్నాడని భావించిన స్వప్న తన దగ్గర ఉన్న కత్తితో అతడి తలపై దాడి చేసింది. గాయపడిన మంజునాథ్‌ను స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఆత్మరక్షణకే అంటున్న అమ్మాయి
తాను ఆత్మరక్షణలో భాగంగానే మంజునాథ్‌పై దాడి చేయాల్సి వచ్చినట్లు స్వప్న పోలీసులకు తెలిపింది. ఒంటరిగా కూర్చొని ఉన్న తన వద్దకు ఆతడు వేగంగా రాబోయాడని, తాను దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడంతో భయపడి తన వద్ద ఉన్న చిన్నపాటి కత్తితో దాడి చేసినట్లు పేర్కొంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top