పక్కా ప్లాన్‌తో హత్య? | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తో హత్య?

Published Tue, Jan 16 2018 6:15 AM

young man murder in yeturi naagaaram - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌,ఏటూరునాగారం: మేడారంలో ఆర్‌ఎం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేయడానికి వచ్చి శనివారం రాత్రి హత్యకు గురైన ప్రసాద్‌ను పక్కాగా  ప్లాన్‌ చేసి అతికిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం, ఆర్థికలావాదేవీల కారణంగా తమ బంధువే అతడిని  హత్య చేసినట్లు మృతుడి సోదరి శిరీష ఆరోపించింది. ఆమె కథనం ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం   నారాయణగిరికి చెందిన పట్టెం ప్రసాద్‌(26) మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగుకు సమీపంలో ఆర్‌ఎం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో  పనిచేయడానికి వచ్చాడు. తమకు వరుసకు బాబాయి అయిన శివనగర్‌కు చెందిన కంభంపాటి పూర్ణచందర్‌ శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి వచ్చి షాపు నుంచి ప్రసాద్‌ను బయటికి తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపినట్లు ఆమె వెల్లడించింది.

పూర్ణచందర్‌ రక్త సంబంధీకురాలితో ప్రసాద్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షగట్టి గతంలో మడికొండకు చెందిన మహేష్‌ వద్ద పంచాయతీ పెట్టించి చితకొట్టించాడని తెలిపింది. అంతేగాక గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమందితో పూర్ణచందర్‌ అల్లుడికి ప్రసాద్‌ డబ్బులు ఇప్పించాడని చెప్పింది. ఆ డబ్బులు ఇవ్వాలని ప్రసాద్‌ పలుమార్లు అల్లుడిని అడిగిన విషయంలో కూడా గొడవలయ్యాయని శిరీష విలేకరులకు తెలిపింది. పై విషయాలను మనసులో పెట్టుకొని ప్రసాద్‌ను చంపివేశారని బోరున విలపించింది. తన సోదరుడిని చంపినవారిని కఠినంగా శిక్షించాలని శిరీష పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న తాడ్వాయి పోలీసులు మృతదేహానికి ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. ప్రసాద్‌ను హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement