ఇప్పుడే వస్తానన్నావ్‌ కదా డాడీ... | Worker Died On Palm Tree | Sakshi
Sakshi News home page

తాటిచెట్టుపై గీతకార్మికుడి మృతి

Jun 8 2018 2:14 PM | Updated on Oct 8 2018 5:19 PM

Worker Died On Palm Tree - Sakshi

సాంబయ్య మృతదేహాన్ని తాటిచెట్టు నుంచి కిందికి దింపుతున్న గ్రామస్తుడు 

గూడూరు(మహబూబాబాద్‌) : ఇప్పుడే వస్తానని కుటుంబసభ్యులతో చెప్పి కల్లుగీసేందుకు వెళ్లిన అరగంటలో ఓ గీతకార్మికుడు తాటిచెట్టు ఎక్కి గుండెపోటుకు గురై చెట్టుపైనే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో గురువారం జరిగింది.

రాంపెల్లి సాంబయ్య(42) కల్లు గీసేందుకు ఇంటి సమీపంలో సెల్‌ టవర్‌ పక్కనున్న తాటిచెట్టును ఉదయం ఎక్కాడు. సగానికి పైగా చెట్టు ఎక్కిన తర్వాత హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో చెట్టుపైనే మోకు, గుజికి వేలాడుతుండగా ప్రధాన రహదారిలో వెళ్తు న్న వారు చూసి వెళ్లి పిలిచారు.

అప్పటికే మృతి చెంది వేలాడుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విష యం తెలిసి మండలకేంద్రంతోపాటు చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు వచ్చి చూసి విలపించారు.

ఇప్పుడు వస్తానన్నావ్‌ కదా డాడీ...

మృతుడి భార్య మంజుల, కూతురు సుమనశ్రీ చెట్టు మధ్యలో వేలాడుతున్న సాంబయ్య మృతదేహాన్ని చూసి రోదించారు. ‘ఇప్పుడు వస్తాను.. టవర్‌ పక్కనున్న చెట్టెక్కివస్తా బిడ్డా.. అని వెళ్లావు కద డాడీ...’ అంటూ కూతురు రోదిస్తూ తల్లి మంజులను ఓదార్చుతుండటం పలువురిని కంటతడి పెట్టించింది.

సీఐ బి.రమేష్‌నాయక్, ఎస్సై ఎస్‌కే.యాసిన్‌ చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దింపారు. మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement