వివాహితపై కుటుంబ సభ్యుల అత్యాచారం

Woman Raped By Drug Addict Husband And Inlaws In Punjab - Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్‌ 19 జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు.. మొహాలికి చెందిన ఓ వివాహిత భర్త అమర్‌జీత్‌ సింగ్‌ మత్తుమందుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రోజూ ఆమెను హింసించేవాడు. దీనిని అలుసుగా తీసుకున్న అతడి తండ్రి అవతార్‌ సింగ్‌, బాబాయిలు(జస్పాల్‌ సింగ్‌, గుర్‌మెయిల్‌ సింగ్‌) కోడలి పట్ల మృగాళ్లలా ప్రవర్తించారు. కొడుకుతో పాటు బాధితురాలికి కూడా మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయం గురించి బాధితురాలు భర్తతో గొడవ పడగా తండ్రికే వత్తాసు పలికిన ఆ ప్రబుద్ధుడు.. భార్యను తీవ్రంగా గాయపరిచి, చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎలాగోలా ఆ రాక్షసుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. అయితే మొదట స్థానిక పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బాధితురాలి ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. దీంతో ఆమె ఎస్పీని కలిసి ఈ దారుణం గురించి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు. కాగా ఈ కేసు నమోదు విషయంలో పోలీసుల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top