మహిత హత్య : పోలీసుల అదుపులో నిందితుడు | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం : డీఎస్పీ నాగేశ్వర రావు

Published Sat, May 4 2019 7:40 PM

West Godavari Mahita Murder Case Police Arrest Accused Kurella Mahesh - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : యలమంచిలి మండలం కాజ గ్రామంలో సంచలనం సృష్టించిన పెనుమాల మహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు కూరెళ్ల మహేష్‌ను పాలకొల్లు రూరల్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ. ‘పథకం ప్రకారమే మహేష్‌ ఈ హత్య చేశాడు. ఈ ఘటనలో మహేష్‌కు అతని స్నేహితులు కూడా సహకరించారు. ప్రస్తుతం అతని స్నేహితులు ఇంతియాజ్‌, కోటేశ్వరావుల కోసం గాలిస్తున్నాం. త్వరలోనే వారిని కూడా అరెస్ట్‌ చేస్తామ’ని తెలిపారు.

నిందుతుడు మహేష్‌ సినిమా షూటింగ్‌లకు క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో షూటింగ్‌ చూడటానికి వచ్చిన మహితతో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో గత మూడు నెలలుగా ప్రేమ పేరుతో మహితను అతను వేధిస్తున్నాడు. అప్పటికే మహేష్‌కు మరొకరితో పెళ్లి అవ్వడమే కాక వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. భార్యతో విభేదాల విషయమై ప్రస్తుతం కోర్టులో‌ కేసు నడుస్తోంది. మహేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడటంతో అతన్ని మహిత  నిలదీసింది. అంతేకాకుండా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో మహేష్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాలకొల్లు వచ్చి మహితకు ఫోన్‌ చేసి.. కలవాలని చెప్పాడు. దాంతో మహిత ఇంటి నుంచి బయటకు వచ్చి మహేష్‌ను కలిసింది. తనను మర్చిపోవాలని కోరింది. మహిత తనను నిరాకరించడంతో మహేష్‌ తన వెంట తెచ్చుకున్న మాంసం కత్తితో అతి కిరాతకంగా మహిత మీద దాడి చేసి చంపాడు.

Advertisement
Advertisement