సుప్రీం జడ్జీల అరెస్ట్.. ప్రజలు షాక్! | Supreme Court main judges arrested due to political crisis in Maldives | Sakshi
Sakshi News home page

సుప్రీం జడ్జీల అరెస్ట్.. ప్రజలు షాక్!

Feb 6 2018 9:51 AM | Updated on Sep 17 2018 4:55 PM

Supreme Court main judges arrested due to political crisis in Maldives - Sakshi

మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన కొన్ని గంటల్లోనే చీఫ్‌ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో సీనియర్ జడ్జి జస్టిస్ అలీ హమీద్‌, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ కీలక నేతను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా సుప్రీం జడ్జీలనే అరెస్ట్ చేయడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

రాజకీయ అనిశ్చితి కారణంగా 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం (ఫిబ్రవరి 5న) ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏ కారణాలు, సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో తెలపలేదు.. కానీ అరెస్ట్ విషయాన్ని ట్వీటర్‌ ద్వారా పోలీసులు వెల్లడించారు. 

రాజకీయ సంక్షోభానికి కారణాలివే...
9 మంది ప్రతిపక్ష నేతలను జైలు నుంచి విడుదల చేయాలని మాల్దీవుల సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించింది. ఇందుకు అధ్యక్షుడు యమీన్‌ నిరాకరించడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ యమీన్‌ ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారు. జడ్జీలు తమ తీర్పుపై వెనక్కి తగ్గక పోవడంతో యమీన్ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా దళాలకు విశేషాధికారాలు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో సీనియర్ జడ్జి జస్టిస్ అలీ హమీద్‌లను అరెస్ట్ చేసి మిగతా ఇద్దరు జడ్జీలు తమ తీర్పును మార్చుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయింది.

Advertisement
 
Advertisement
Advertisement