ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్‌ షాక్‌ 

software engineer put current shock his wife - Sakshi

సాక్షి, కృష్ణా : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ, ఆపై ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చాడు ఓ శాడిస్టు. ప్రాణాపాయం నుంచి బయటపడిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు సంవత్సరాల క్రితం పెనమలూరు పెద్ద గుడి ప్రాంతానికి చెందిన ప్రశాంతి, అదే ప్రాంతానికి చెందిన శ్రీలం రాజారత్నం (శ్రీలం రాజా)పరస్పరం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. రాజా గతంలో విదేశాల్లో ఉండి వచ్చాడు. అతనికి గతంలో వివాహం కాగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నాడు. కాగా వీరికి మొదటి సంతానం బాబు పుట్టాడు.

ఆ తరువాత నుంచి రాజా కట్నం తీసుకు రమ్మని భార్యను వేధించసాగాడు. భర్త వేధింపుల పై భార్య గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్ద మనుషులు రాజీ చేయడంతో కేసు ఉపసంహరించుకుంది. ఇటీవల వీరికి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టడంతో భర్త రాజా భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 2న ప్రశాంతి తల్లి బాబును ఆడిస్తుండగా రాజా ఇంటికి వచ్చాడు. గదిలో నిద్రిస్తున్న భార్య ప్రశాంతి, పాప వద్దకు వచ్చి, ప్లగ్‌లో కరెంటు వైర్లు ఉంచి భార్యకు కరెంట్‌షాక్‌ ఇచ్చాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా నిద్ర లేచిన ప్రశాంతి భయంతో కేకలు వేయగా బయట ఉన్న ఆమె తల్లి ఇంట్లో వచ్చింది. దీంతో  రాజా అక్కడినుంచి పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో భర్త రాజా, ఆయనకు మద్దతు పలుకుతున్న అతని తండ్రిపై పోలీసులు కట్నం, దాడి కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటన పై బాధితురాలు పోలీసులకు శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. బాధితులు మీడియాకు  సమాచారం తెలపటంతో పోలీసులు అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top