ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
అనంతపురం జిల్లా ఎర్రగుంటపల్లి వద్ద ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ-వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 9మందిగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు రెండూ వేగంగా వస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
గాయపడ్డ వారిని సమీపంలోని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సైతం పట్టించుకునే నాధుడే కరువైయ్యాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా బాధితులు అనంతపురం- చెన్నై రహదారిని దిగ్భందించారు. వారి ఆందోళనతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.