గర్భవతిని చేసి.. పెళ్లి పేరుతో దారుణం!

Pregnant dies due to un maritual relation - Sakshi

సాక్షి, డోన్‌ : ప్రేమపేరుతో ఒక యువతిని వంచించడమే కాక గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి ఓ కిరాతకుడు ఆమెను దారుణంగా హతమార్చాడు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామశివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక కొండపేటకు చెందిన లక్ష్మీదేవి, మల్లేష్‌ల కుమార్తె రమిజాబికి ఐదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ యువకునితో వివాహం జరిగింది. వీరికి సంతానం అఖిల్‌ కుమార్‌(4) ఉన్నాడు. రమిజాబితో ఏర్పడిన విబేదాల కారణంగా భర్త రెండేళ్ల క్రితం విడాకులు తీసుకోవడంతో రమిజాబి తన కుమారునితో పాటు తల్లివద్దనే ఉంటోంది.

నమ్మించి హతమార్చాడు
కుటుంబ పోషణ నిమిత్తం పాతబస్టాండ్‌లోని మెహతాజ్‌ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న కాలంలో రమిజాబికి షాపు యజమాని షేక్‌ మహమ్మద్‌ పహిల్మాన్‌ కుమారుడైన షేక్‌ రషీద్‌ అలియాజ్‌ సిద్దు (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది  వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని రమిజాబి తన ప్రియుడు షేక్‌ రషీద్‌ (సిద్దు) పై పోలీసులకు పిర్యాదు కూడా చేసింది. కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఇరువురి మధ్య రాజీ కుదర్చడం ద్వారా స్టేషన్లో కేసు లేకుండా చేసుకున్నారు.

ఆ తర్వాత షేక్‌ రసీద్‌ తన పద్దతి మార్చుకోకుండా రమిజాబితో తన సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో రమిజాబి గర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలంటూ మరోసారి ప్రియుడిపై ఒత్తిడి పెంచింది. ఆమెను హతమార్చేందుకు రషీద్ పథకం పన్నాడు. నంద్యాలలో ఇద్దరం కలిసి జీవించవచ్చని నమ్మబలికి రమిజాబిని గత నెల 20న కొండపేటలోని ఆమె ఇంటి నుంచి బస్సులో ఎర్రగుంట్ల గ్రామానికి తీసుకెళ్లాడు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గర్భవతి రమిజాబి గొంతును చున్నితో బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టి తిరిగి పట్టణానికి చేరుకున్నాడు.

తల్లి పిర్యాదుతో వెలుగులోకి...
వారం రోజులైనా తన కూతురు నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానించిన రమిజాబి తల్లి లక్ష్మిదేవి పోలీసులకు రషీద్‌ పై గత మంగళవారం పిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటూ తన కూతురు ఆచూకి కోసం డోన్‌ పోలీసులకు ఆదేశాలివ్వాలని కూడా ఆమె జిల్లా ఎస్పీని కూడా ఇటీవల కోరింది. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు షేక్‌ రషీద్‌ను విచారించగా రమిజాబి హత్యకేసు మిస్టరీ వీడింది. రమిజాబి మృతితో ఆమె కుమారుడు చిన్నారి అఖిల్‌ అనాథగా మారాడు.

సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం
నిందితుని సహాయంతో రమిజాబి హత్య జరిగిన స్థలాన్ని ఆదివారం సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్‌ఐ శ్రీనివాసులు సందర్శించి మృతదేహాన్ని వెలికితీశారు. తహశీల్దార్‌ మునిక్రిష్ణయ్య, ఆర్‌ఐ మధు కుమార్ల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి వైధ్యులు డాక్టర్‌ సుంకన్న, బాలచంద్రారెడ్డి సహాయంతో శవపరిక్షలు నిర్వహించి మృతదేహాన్ని బందువులకు అప్పగించారు. నిందితుని పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ శ్రీనివాసులు గౌడ్‌ తెలిపారు.

గర్భవతిని చేసి.. పెళ్లి పేరుతో దారుణం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top