హైవేపై ఆయిల్‌ దొంగలు..! | Oil Robberies In Natnal Highway Ulavapadu Prakasam | Sakshi
Sakshi News home page

హైవేపై ఆయిల్‌ దొంగలు..!

Aug 10 2018 12:06 PM | Updated on Aug 10 2018 12:06 PM

Oil Robberies In Natnal Highway Ulavapadu Prakasam - Sakshi

లారీ నుంచి ఆయిల్‌ తీస్తూ..

ప్రకాశం , ఉలవపాడు: జాతీయ రహదారిపై దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాల నుంచి ఆయిల్‌ను దొంగిలిస్తున్నారు. ప్రధానంగా మన్నేటికోట అడ్డరోడ్డు, కరేడు ర్యాంపు, చాగల్లు సెంటర్లలో దొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. 15 రోజుల కాలంలో ఈ చోరీలు అధికమయ్యాయి. మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద పది రోజుల క్రితం వరుసగా రెండు రోజులపాటు ఆయిల్‌ చోరీ చేశారు.  ఒక రోజు నిలిపి ఉంచిన లారీ నుంచి 300 లీటర్లు డీజిల్‌ దొంగతనం చేశారు. మరుసటి రోజే రెండు లారీల నుంచి 200 చొప్పున 400 లీటర్ల ఆయిల్‌ చోరీ చేశారు. కరేడు ర్యాంపు వద్ద 8 గంటల సమయంలోనే డ్రైవర్‌ టిఫిన్‌ చేస్తుండగా డీజిల్‌ చోరీ జరిగింది. ఈ లోపు డ్రైవర్‌ క్యాబిన్‌లో నగదు కూడా తీసుకెళ్లారు. ఈ ఆయిల్‌ దొంగతనాల గురించి లారీ డ్రైవర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల క్రితం మన్నేటికోట రోడ్డు వద్ద  పోలీస్‌ జీప్‌ వస్తున్న సమయంలో క్యాబిన్‌లోకి ఎక్కి ఉన్న ఇద్దరు దొంగలు పారిపోయారు. దొంగల భయంతో వాహనాలు నిలపాలంటేనే లారీ డ్రైవర్లు భయపడుతున్నారు.

ద్విచక్ర వాహనాలపై వస్తున్న దొంగలు...
జాతీయ రహదారిపై ఎక్కువగా ఆయిల్‌ దొంగతనానికి వస్తున్నవారు ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. ఒకరు వాహనంపై బండిస్టార్ట్‌ చేసి ఉంటున్నారు. ఈ లోపు మరొకరు క్యాబిన్‌లోకి ఎక్కి దొంగతనాలు చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం పోలీస్‌ వాహనం వెంబడించినప్పుడు ఇదే పరిస్థితి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తిప్పకు చెందిన వారు జాతీయ రహదారిపై ఇలా చోరీలకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు అంటున్నారు. హైవేపై ఎక్కువగా భోజనం, బిర్యానీ కోసం లారీలు ఆగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో గత నెల కాలంగా చోరీలు అధికమయ్యాయి. గతంలో డీజిల్‌ దొంగలు ఈ ప్రాంతంలో బొలెరో వాహనంలో వచ్చి చోరీలు చేసేవారు. అప్పట్లో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అలానే ఈ దొంగలను కూడా పట్టుకోవాలని కోరుతున్నారు.

హైవే మొబైల్‌ లేకపోవడంతో అధికమైన చోరీలు: నిత్యం గస్తీ తిరిగే హైవే మొబైల్‌ వాహనం 45 రోజులుగా లేదు. ఈ వాహనంలో పనిచేసే సిబ్బంది కూడా ద్విచక్ర వాహనాలపై తిరగాల్సి వస్తుంది. రాత్రిపూట వారే రాజుపాలెం జంక్షన్‌ వద్ద రాత్రి భయపడుతూ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వాహనం ఉంటే కాస్త దొంగలకు భయంగా ఉండేది. కానీ ఇప్పుడు వాహనం లేకపోవడంతో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. వాహనం నిలపాలంటే భయపడుతున్న డ్రైవర్లు దొంగలను అరికట్టాలని కోరుతున్నారు. జాతీయ రహదారిపై జరుగుతున్న చోరీలు నిలపాలని, దొంగలను పట్టుకొని వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement