ఆయిల్ ట్యాంకర్ ఢీ : నవ దంపతులు మృతి
చిత్తూరు , వి.కోట : మోటార్ సైకిల్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని నవదంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిలోని తోటకనుమ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం..మండలంలోని విభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన సోమప్ప కుమారుడు అశోక్(23), అతని భార్య అశ్విని (18) పలమనేరు నుంచి వి.కోట వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వి.కోట నుంచి ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ వారిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. వారికి రెండు నెలల క్రితమే వివాహమైంది. వీరి మరణంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.