దారుణం: మూడు నెలల చిన్నారిని బండకేసి..

Maternal Uncle Killed Three months Old Child In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెలలు నిండని ఓ చిన్నారిపై తాగుడు బానిసైన సొంత మేనమామే కిరాతకంగా ప్రవర్తించాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో చిన్నారిని నేలకేసి కొట్టి.. చంపాడు ఆ దుర్మార్గుడు. జిల్లాలోని పెద్దవూర మండలం చిన్నగూడెంలో జరిగిన ఈ ఘటన అందరి మనసులను ద్రవింపజేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. మరోసారి గర్భవతి అయిన  లక్ష్మీ మూడు నెలల క్రితం డెలివరీ కోసం నల్లగొండలోని తన స్వగ్రామానికి వచ్చింది. డెలివరీ అనంతరం తల్లిగారి ఇంటి వద్ద ఆమె ఉండగా..  శుక్రవారం పెద్ద కూతురు పుట్టినరోజు కావడంతో తండ్రి వెంకటేశ్వర్లు అత్తవారింటికి వచ్చాడు. ఈ సమయంలో మద్యానికి బానిసైన లక్ష్మీ సోదరుడు ఉపేందర్‌ తన తండ్రితో డబ్బులు కావాలని గొడవ పడ్డారు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో.. కోపంతో తాగిన మత్తులో అక్క కుమార్తె అయిన మూడు నెలల చిన్నారిని బండకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ క్రమంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం అందించారు. భయంతో చిన్నారి తల్లి లక్ష్మీ, అమ్మ‍మ్మ కూడా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా ఉపేందర్‌ తన తండ్రిపై , అక్కలపై కత్తితో దాడి చేశారని, ఊరులోని ఆడవాళ్లతో దురుసుగా ప్రవర్తించే వాడని గ్రామస్తులు పోలీసుల ముందు వాపోయారు. భార్య, పిల్లలను తీసుకొని సొంత ఊరికి వెళ్లడానికి వచ్చానని, ఆ లోపే తన బిడ్డను చంపాడని చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top