గంజాయి ఫ్రం సూర్యాపేట | Marijuana Smugglers Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

గంజాయి ఫ్రం సూర్యాపేట

Feb 1 2019 10:47 AM | Updated on Feb 1 2019 10:47 AM

Marijuana Smugglers Arrest in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సూర్యాపేట జిల్లా నుంచి గంజాయిని అక్రమ రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ముఠా గుట్టును వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 31 కేజీలు స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం తెలిపారు. మంగళ్‌హాట్‌కు చెందిన రాజు సింగ్‌ గతంలో బేగంబజార్‌లోని ఓ మెడికల్‌షాప్‌లో పని చేశాడు. ఆపై గణేష్‌ విగ్రహాల తయారీదారుడిగా మారాడు. ఈ ఆదాయంతో సంతృప్తి చెందని రాజు గంజాయి దందా మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో గతంలో రెండుసార్లు అరెస్టై జైలుకు వెళ్లాడు. ఏడాది క్రితం బెయిల్‌పై బయటిని వచ్చిన ఇతను మళ్లీ గణేష్‌ విగ్రహాల తయారీ మొదలు పెట్టాడు.

ఈ ఆదాయంతో విలాస జీవితం గడపటం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం, జల్మల్‌కుట తాండకు చెందిన లావూరి సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. వివిధ మార్గాల్లో కేజీ రూ.2500 చొప్పున గంజాయి సేకరిస్తున్న అతను దానిని రూ.5 వేలకు విక్రయించేవాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు తన ప్రాంతానికే చెందిన కిషన్‌సింగ్, పూల్‌ సింగ్‌లతో జట్టు కట్టాడు. ముగ్గురు కలిసి విక్రయించాలనే ఉద్దేశంతో 31 కేజీలు తీసుకురావాలని సంతోష్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. అతడు గంజాయి తీసుకువచ్చి డెలివరీ చేసి వెళ్లాడు. దీనిని పంచుకునేందుకు మిగిలిన ఇద్దరినీ ఆసిఫ్‌నగర్‌కు రావాల్సిందిగా రాజు సూచించాడు. దీంతో వారు ఇద్దరూ గురువారం నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంతోష్‌ కోసం గాలిస్తున్నారు. 

గంజాయి రవాణా చేస్తున్న8 మంది అరెస్టు..
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిదిమంది నిందితులను అరెస్ట్‌ చేసి 8.44 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు గురువారం తెలిపారు. జూబ్లీహిల్స్, అప్పర్‌ ధూళ్‌పేట్‌ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఏఈఎస్‌ అంజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement