నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం | Lovers Commits Suicide in Visakhapatnam | Sakshi
Sakshi News home page

పెళ్లి చేస్తామన్నారు.. ఇంతలోనే..

Feb 13 2020 10:59 AM | Updated on Feb 13 2020 11:07 AM

Lovers Commits Suicide in Visakhapatnam - Sakshi

శిరీష, వెంకటేష్‌

నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో ఏమైందో గానీ ముందుగా యువతి.. ఆ తరువాత ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతులిద్దరూ యలమంచిలి వాసులు. ప్రస్తుతం వీరు నగరంలో ఉంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

సాక్షి, విశాఖపట్నం: వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు... విషయం ఇంట్లో వారికి తెలియడంతో కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేస్తామన్నారు... ఇంతలో ఏం జరిగిందో ముందుగా యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయం తెలియడంతో ఆమె లేని జీవితం ఎందుకని ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు విశాఖలో కలకలం రేపాయి. గోపాలపట్నం, కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యలమంచిలి రామ్‌నగర్‌లో తల్లిదండ్రులు, అక్కతో కలిసి నివసించే మక్క శిరీష(20) నాలుగేళ్ల కిందట అక్కడే ఇంటర్‌ చదువుతూ అదేప్రాంతానికి చెందిన వెంకటేష్‌(22)ను ప్రేమించింది. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో అక్కకు పెళ్లి చేసిన తర్వాత శిరీష పెళ్లి చేస్తామని చెప్పారు. అనంతరం కుటుంబంతో సహా గోపాలపట్నం వచ్చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఓ రెస్టారెంట్‌ నడపుతూ, దానిపై ఇంటిలో జీవిస్తున్నారు. అయినప్పటికీ వెంకటేష్‌తో ఫోన్‌లో శిరీష మాట్లాడుతుండేది.

 శిరీష, వెంకటేష్‌ (వెంకటేష్‌ మృతదేహం)

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రెస్టారెంట్‌ కౌంటర్‌లో శిరీష ఉండగా వెంకటేష్‌ ఫోన్‌ చేశాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ వెంకటేష్‌కు మెసేజ్‌ చేసి మేడపైన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ మెసేజ్‌ను యువతి అక్కకి వెంకటేష్‌ పంపించగా... ఆమె అప్రమత్తమై మేడపైకి వెళ్లి చూడగా శిరీష అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే రెస్టారెంట్‌ సిబ్బంది సాయంతో యువతిని కిందకు దించి గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారని పోలీసులు చెప్పారు. 

ప్రియురాలు లేదని...  
మరోవైపు ప్రియురాలు చనిపోయిందన్న విషయం ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న వెంకటేష్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధి బర్మా క్యాంపు సమీపంలో నివసిస్తున్న అతను అక్కడికి దగ్గరలోని చెట్టుకు బుధవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని చెప్పినప్పటికీ ఎందుకు ఇలా చేసుకున్నారో అర్థం కావడం లేదని యువతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement