ఎంత ఘోరం

Inter Student Deepika Died in Bus Accident Karnataka - Sakshi

కళాశాలకు వెళ్తుండగా మృత్యువాత  

మాలూరు తాలూకాలో విషాదం

కర్ణాటక, మాలూరు: రెండు బస్సుల నడుమ ఓ విద్యార్థిని  నలిగి మృతి చెందిన విషాద ఘటన సోమ వారం ఉదయం పట్టణంలోని బస్టాండు ప్రాంగణంలో చోటు చేసుకుంది. తాలూకాలోని జయమంగల గ్రామ పంచాయతీ పరిధిలోని తాళికుంటె గ్రామానికి చెందిన టీఎం దీపిక (19) ప్రమాదంలో మృత్యువాతపడింది. దీపిక ప్రభుత్వ  జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఉదయం కళాశాల కోసం గ్రామం నుంచి బయలుదేరింది.  ఈ సమయంలో తమిళనాడుకు చెందిన ప్రైవేటు బస్సులో ఎక్కడానికి ప్రయత్నించింది.

అయితే బస్సు డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కు తిప్పుతున్న సమయంలో వెనుక ఉన్న కేఎస్‌ ఆర్టీసీ బస్సు దగ్గరగా వచ్చింది. ఈ సమయంలో బాలిక రెండు బస్సుల మధ్యన చిక్కుకుని నలిగి చనిపోయింది.  బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.విషయం తెలుసుక్ను స్థానికులు ఆందోళన నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి విరమించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top