సెలైన్‌లో ఫంగస్‌

Fungus in saline

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలుడికి ఎక్కించిన వైనం

గుర్తించిన బాధితుడి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: సరోజినిదేవి ఆస్పత్రిలో ఫంగస్‌ ఉన్న సెలైన్‌తో కళ్లను శుభ్రం చేయడంతో ఏడుగురి కళ్లుపోయిన ఘటనను మరచిపోక ముందే తాజాగా హైదరాబాద్‌ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనే జరిగింది. అనారోగ్యంతో వచ్చిన ఓ బాలుడికి ఫం గస్‌ ఉన్న సెలైన్‌ ఎక్కించారు. దీన్ని గుర్తించిన బాలుడి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన మనోహర్‌లింగం కుమారుడు వంశీ(11)కి ఫిట్స్‌ రావడంతో సమీపంలోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు సెలైన్‌ ఎక్కించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సెలైన్‌ బాటిల్‌ పరిశీలించకుండానే ఎక్కించారు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు, బంధువులు సెలైన్‌ బాటిల్‌ను పరిశీలించగా అందులో ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై సదరు ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా వారి నుంచి కనీస స్పందన రాలేదు. ఆగ్రహించిన రోగి బంధువులు నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐపీసీ 336 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top